బోర్డర్ టెన్షన్స్... చైనాతో చర్చలు సఫలమే... కానీ అనుకోని ట్విస్ట్...
సోమవారం(జూన్ 22) నుంచి ఏకధాటిగా 11గంటల పాటు జరిపిన చర్చల తర్వాత ఎట్టకేలకు భారత్-చైనా మధ్య ఒక అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపాయి. అయితే ఇదంతా ఒక్కరోజులో జరిగే పని కాదని తాజాగా భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దశల వారీగా సైనికుల ఉపసంహరణ జరుగుతుందని స్పష్టతనిచ్చాయి. ఈ లెక్కన ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది వేచి చూడాల్సిన అంశం.
మరిన్ని చర్చలు అవసరమవుతాయంటున్న ఆర్మీ...
తాజా చర్చల్లో సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అనుసరించాల్సిన పద్దతులపై విస్తృత సమాలోచనలు జరిపారు. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పటివరకూ తెలియవస్తున్న సమాచారం ప్రకారం.. దశలవారీగా సైన్యం ఉపసంహరణకు ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే దీనిపై తుది ఏకాభిప్రాయం సాధించేందుకు కమాండర్ స్థాయిలో మరిన్ని చర్చలు అవసరమవుతాయని చెబుతున్నారు.
ఆ రెండు ప్రాంతాలే సంక్లిష్టం...
సైన్యం ఉపసంహరణలో భాగంగా మొదట ఘర్షణాత్మక వాతావరణం లేని ప్రాంతాల్లో ఆ ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది. జూన్ 15న ఇరు దేశాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీలో మాత్రం సైన్యాల ఉపసంహరణ ఒకింత సవాల్తో కూడుకున్నదేనని చెబుతున్నారు. అలాగే పాంగోంగ్ సరస్సు ప్రాంతంలోనూ సైన్యం ఉపసంహరణ ఒకింత క్లిష్టంగానే ఉంటుందని భావిస్తున్నారు. వివాదాస్పద ప్రాంతంగా ఉన్న ఫింగర్ 4-ఫింగర్ 8 ప్రాంతానికి ఇరు దేశాల మిలటరీ ఎలాంటి రోడ్ మ్యాప్ రూపొందిస్తుందో చూడాలని సైనికాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
Recommended Video
యధాతథ స్థితిని కొనసాగించాలంటున్న భారత్..
పాంగోంగ్ సో సరస్సు వెంబడి మే 5కి ముందు ఉన్న యధాతథ స్థితిని కొనసాగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అంటే,ఫింగర్ 4 నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకూ ఉన్న చైనా నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. వీటి పట్ల మున్ముందు చర్చల్లో చైనా ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. మోల్దోలో భారత్,చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు సానుకూల వాతావరణంలో అర్థవంతంగా ముగిశాయని భారత ఆర్మీ ప్రకటించడంతో సరిహద్దు వెంబడి ఇక ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశాభావం మాత్రం వ్యక్తమవుతోంది.