పంజాబ్లో మోడీని దెబ్బకొట్టిన కాంగ్రెస్: ఈ రాష్ట్రాలు బీజేపీవే!
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ను బట్టి చూస్తుంటే బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అయిదు రాష్ట్రాలలో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో కమలం దూసుకెళ్తోంది.
ఉత్తరాఖండ్ బీజేపీదే
ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 38 నుంచి 45 సీట్ల వరకు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేలు నిజమైతే అక్కడ కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడి బీజేపీని గెలిపించినట్లే.
పంజాబ్ బీజేపీ-అకాలీదళ్లకు షాక్
పంజాబ్లో అకాలీధల్ - బీజేపీ కూటమి ఘోర పరాజయం చవి చూడనుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటి దాకా దళ్-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. పంజాబ్లో 117 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ-అకాలీదళ్ కూటమికి పదిలోపే వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గెలుస్తుందని కొన్ని సర్వేలు, ఏఏపీ గెలుస్తుందని మరిన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే, మెజార్టీ సర్వేలు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. పంజాబ్లో మోడీ ప్రచారం చేశారు. బాదల్లను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ ఆ ప్రభావం కనిపించలేదు.
గోవా మళ్లీ బీజేపీదే
గోవాలో మళ్లీ కమలం పార్టీ గెలవనుంది. 42 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 18 లేదా అంతకు పైగా, కాంగ్రెస్ 16 స్థానాలు గెలుస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కొంత పుంజుకుంటోంది. ఏఏపీ మూడుకు అటు ఇటు స్థానాలే గెలుచుకోనుందని చెబుతున్నాయి. అంటే ఏఏపీ సత్తా కనిపించలేదనే చెప్పవచ్చు.
మణిపూర్లో బీజేపీ
మణిపూర్లో బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 28, కాంగ్రెస్ 20 స్థానాలు, ఇతరులు 12 స్థానాలు గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.