ఎగ్జిట్ పోల్స్పై కొరడా.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!
ఢిల్లీ : ఎన్నికలు వస్తే చాలు ప్రీ పోల్స్ సందడి చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి జరిగే హడావిడి అందరికీ తెలిసిందే. కొన్ని సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి రానుందో చెప్పే క్రమంలో ఆ గణాంకాలు ప్రజానీకాన్ని ఊపిరి బిగపట్టేలా చేస్తాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసేందుకు చాలామంది టీవీలకు అతుక్కుపోతారంటే అతిశయోక్తి కాదు. ఇక మీడియా ప్రపంచమంతా దాన్ని హైలైట్ చేస్తూ ఎక్కడా లేని హడావిడి చేస్తుంటుంది. అయితే ఎగ్జిట్ పోల్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి ఊహలకు అందవు. కొన్ని సంస్థలు ఒక్కో రకంగా చెబుతుంటాయి. ఆ క్రమంలో రెండు మూడు సంస్థల గణాంకాలు దగ్గరగా కనిపిస్తుంటాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెనుక రాజకీయ జోక్యం ఉంటుందనే వాదనలు లేకపోలేదు. ఇక కొన్ని సంస్థలేమో ఆయా పార్టీలకు కొమ్ము కాస్తూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తాయనే వాదనలకు కూడా కొదువ లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఈసీ అధికారులు తీసుకున్న నిర్ణయం హాట్ టాపికైంది.
పానీ ఔర్ కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు షాక్..!
ఈ నెల 21వ తేదీన కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. 17 రాష్ట్రాలకు సంబంధించి 51 అసెంబ్లీ సెగ్మెంట్లలో బై పోల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడు ఎగ్జిట్ పోల్స్పై తన నిర్ణయం వెల్లడించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఛత్తీస్ గఢ్, పుదుచ్చేరి, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే అంశంపై కొరడా ఝలిపించింది. ఎన్నికలు జరగనున్న 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించింది.