ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు..900 పాయింట్లకు ఎగబాకిని సెన్సెక్స్
ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. ఎన్డీయే తిరిగి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఒక్కసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లకు ఎగబాకింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79 పైసలు పెరిగింది. మార్కెట్లు ప్రారంభం కాగానే 962 పాయింట్లు పెరుగుదల కనిపించి ఆ తర్వాత 687.63 పాయింట్లతో లాభాల బాటన ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ కూడా 203.05 పాయింట్లతో 1.78శాతం పెరిగి 11,610.20 పాయింట్లకు చేరుకుంది.
ఆదివారం విడుదలైన వివిధ సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి అధికారంలోకి వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్తో ప్రారంభమయ్యాయి. దీంతో మారుతి, ఎల్ & టీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్ఐఎల్, ఎం&ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, వేదాంతలు నాలుగుశాతం పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. మరోవైపు బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, హెసీఎల్ టెక్ 2శాతానికి తగ్గుదల నమోదు చేశాయి.
టెన్షన్ పోల్స్ : ఏపీలో చంద్రబాబుదే అధికారం... లోక్సభలో జగన్దే పైచేయి
మార్కెట్ అంచనాలకు మించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయని అధికార పార్టీనే తిరిగి ప్రభుత్వంలోకి వస్తుందన్న అంచనాలపై మార్కెట్లు పరుగులు తీశాయని అన్నారు రిలయన్స్ సెక్యూరిటీ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి. అయితే ఈ జోష్ భవిష్యత్తులో ఉంటుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేమన్నారు. ఎందుకంటే మార్కెట్ల ముందు పలు సవాళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. వృద్ధి, తక్కువ ద్రవ్యనిధి, ఆర్థిక వ్యవస్థ మందగించడం, ప్రపంచ సవాళ్లు ఇలా చాలా అధిగమించాల్సి ఉంటుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బ్యాంకింగ్ స్టాక్స్ రంగాలు లాభాల బాట పట్టే అవకాశం ఉందని అన్నారు.
ఇక విదేశీ సంస్థల పెట్టుబడిదారులు వారి వాటాలకు సంబంధించి రూ. 1,057 కోట్లు విలువైన షేర్లను అమ్ముకున్నారు. మరోవైపు దేశీయ పెట్టుబడిదారులు రూ.1809 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఇక ఆసియా దేశాల్లో చైనా, జపాన్, కొరియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి.