ఎగ్జిట్ పోల్స్: అమ్మకు షాక్, డిఎంకె కూటమికి పట్టం?
న్యూఢిల్లీ:ఎన్నికలు ముగిశాయో లేదో.. ఎగ్జిట్ పోల్స్ వెలువడడంతో ఆయా పార్టీల గెలుపోటములపై తమిళనాడులో చర్చలు జోరందుకున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అమ్మకు షాక్ ఇస్తే.. డీఎంకే కూటమికి గెలుపుపై ధీమాను పెంచాయి. దీంతో తమిళనాడులో ముందునుంచి కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దఫా అన్నాడీఎంకే అవకాశం ఇస్తే.. మరో దఫాకు డీఎంకే కి పట్టం కట్టడం అక్కడి ప్రజలు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
తాజా ఎగ్జిట్ ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే..
డీఎంకే కూటమి 124-140
అన్నాడీఎంకే 89-101
బీజేపీ 0-3
ఇతరులు 04-08 స్థానాలు కైవసం చేసుకోబోతున్నారని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఇక పుదుచ్చేరి ఎగ్జిట్ ఫలితాలకొస్తే..
ఏఐఎన్ఆర్బీ 08-12
కాంగ్రెస్ 15-21
అన్నాడీఎంకే 0-4
ఇతరులు 2 స్థానాలు కైవసం చేసుకుంటాయని ఫలితాలు వెల్లడయ్యాయి.
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెసు, వామపక్షాలు ఏకమైనప్పటికీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీని అడ్డుకోలేపోయాయి. మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వస్తారని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపలేదని తెలుస్తోంది.
ఎబిపి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం - పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు 178 సీట్లను గెలుచుకుంటోంది. కాంగ్రెసు, వామపక్షాల కూటమికి 110 సీట్లు వస్తాయి. బిజెపి ఒక్క సీటును మాత్రమే దక్కించుకోబోతోంది. ఇతరులు ఐదు సీట్లలో పాగా వేస్తున్నారు.
బెంగాల్ టైమ్స్ సర్వే ప్రకారం - తృణమూల్ కాంగ్రెసుకు 167 సీట్లు రాబోతున్నాయి. వామపక్షాలు 75 సీట్లను,త కాంగ్రెసు 45 సీట్లను గెలుచుకుంటాయి. బిజెపి మాత్రం నాలుగు సీట్లు దక్కించుకుంటుంది. ఇతరులకు మూడు సీట్లు వస్తాయి.
ఇదిలావుంటే, కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డిఎఫ్) పాగా వేయబోతోంది. ఎల్టీఎఫ్కు 78 నుంచి 82 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. బిజెపి కేరళలో 71 సీట్లు గెలుచుకుంటుందని బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన క్రికెటర్ శ్రీశాంత్ అంటున్నారు.
అసోంలో మాత్రం బిజెపికి ఊరట కలిగించే ఫలితాలు వస్తున్నాయి. ఇండియా టుడే సర్వే ప్రకారం బిజెపికి 79 నుంచి 93 సీట్లు వస్తున్నాయి. కాంగ్రెసు 26 నుంచి 33 సీట్లకు పడిపోతోంది. కాంగ్రెసు కేరళలోనూ, అసోంల్లో కాంగ్రెసు అధికారాన్ని కోల్పోతోంది.