కాంగ్రెస్ దూత బాబుకు చుక్కెదురు: సంధి ప్రయత్నాలకు గండి: సోనియాతో భేటీకి బెహన్జీ ససేమిరా
న్యూఢిల్లీ: అసలు కంటే కొసరు అధికమైందనేది ఓ పాత సామెత. దాన్ని నిజం చేస్తున్నాయి దేశ రాజకీయాలు. అసలు ఫలితాలు ముందుండగా.. కొసరుగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం ప్రకంపనలను పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీల్లో చిచ్చు పెడుతోంది. ఎవరి దారి వాళ్లు చూసుకునేలా చేస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్లో మహాకూటమి కట్టిన సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీలను కాంగ్రెస్ దగ్గర చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీతో సమావేశం కావడానికి మొదట అంగీకరించిన బీఎస్పీ చీఫ్ మాయావతి.. ఆ తరువాత అడ్డు తిరిగారు. సోనియాను కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అంటే ఏ మాత్రం పొసగదు ఎస్పీ, బీఎస్పీలకు. ఈ రెండు పార్టీలతో పాటు రాష్ట్రీయ లోక్దళ్ను కూడా కలుపుకొని ఉత్తర్ ప్రదేశ్లో మహాకూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్లో మహాకూటమికి మెజారిటీ స్థానాలు అంటూ రావటం జరిగితే- దాని ప్రయోజనాన్ని కాంగ్రెస్ పార్టీకి దక్కేలా చంద్రబాబు రాజకీయ చతురతను ప్రదర్శించారు. కాంగ్రెస్ దూతగా అవతరించారు.
ఆయా పార్టీల అధినేతలు అఖిలేష్ యాదవ్, మాయావతిలతో ఇదివరకే సమావేశం అయ్యారు. చంద్రబాబు బుజ్జగింపులు ఫలించాయి. అఖిలేష్ యాదవ్, మాయావతిలు సోనియాగాంధీతో భేటీ కావడానికి సిద్ధపడ్డారు.
ఈ లోగా- ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. కథ అడ్డం తిరిగింది. ఉత్తర్ ప్రదేశ్లో మహాకూటమికి మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహాకూటమి అధిక స్థానాలను దక్కించుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చేయడంతో.. ఆ పార్టీ నాయకులు చెట్టెక్కారు. బెట్టు చేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో సోనియాగాంధీ-మాయావతి సమావేశం కావాల్సి ఉంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. మాయావతి ఈ భేటీని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ సీనియర్ నేత సతీష్ చంద్ర మిశ్రా తెలిపారు. మాయావతి ఢిల్లీకి వెళ్లట్లేదని, ఆమె లక్నోలోనే ఉంటున్నారని ఆయన స్పష్టం చేశారు. సోనియాగాంధీతో సమావేశం కావట్లేదంటూ అఖిలేష్ యాదవ్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే మాయావతి కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవడం కాంగ్రెస్కు మింగుడు పడని విషయం.