ప్రధానితో జమ్మూ-కశ్మీర్ నేతల భేటీపై భారీ అంచనాలు- ఎన్నికలకు సహకరిస్తే రాష్ట్ర హోదా ?
ఇవాళ జమ్మూకశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతలతో ప్రధాని మోడీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. జమ్మూకశ్మీర్ను మూడు ముక్కలు చేయడం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధానితో అక్కడి రాజకీయ నేతలు జరుపుతున్న తొలి భేటీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో తిరిగి జమ్మూ-కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వడం, ఎన్నికల నిర్వహణ వంటి అఁశాలు చర్చకు రానున్నాయి. అయితే ప్రధాని మోడీ నుంచి భారీ హామీలైతే ఉండకపోవచ్చని తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్ నేతలతో ప్రధాని భేటీ
దాదాపు రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడమే కాకుండా రాష్టానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఆ తర్వాత అయినా అక్కడి పరిస్ధితులు చక్కబడ్డాయా అంటే అదీ లేదు.
అదే సమయంలో అక్కడ దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్దులుగా ఉన్న నేతలంతా కలిసి గుప్కార్ అలయన్స్ పేరుతో ఓ కూటమిగా ఏర్పడి కేంద్రంపై పోరు మొదలుపెట్టారు. దీంతో తమ ప్రయోగం వికటించిందని భావిస్తున్న కేంద్రం.. సాధ్యమైనంత త్వరగా అక్కడ పరిస్ధితుల్ని తిరిగి సాధారణ స్ధితికి తెచ్చేందుకు జమ్మూకశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతల్ని ప్రధాని మోడీతో భేటీకి ఆహ్వానించింది.
జమ్మూకశ్మీర్పై తేల్చేస్తారా?
జమ్మూ-కశ్మీర్ విషయంలో రెండేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పటికీ అక్కడ తొలగిపోలేదు. తమ నిర్ణయంతో తీవ్రవాదం నిర్మూలన జరిగిందని చెప్పుకుంటున్నా ఇప్పటికీ అక్కడ దాడులు మాత్రం ఆగలేదు. ప్రజల్లో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది.
దీంతో అక్కడి రాజకీయ నేతలు సైతం ప్రజాభిప్రాయం మేరకు కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. మరోలా చెప్పాలంటే గతంలో కేంద్రంతో పాటు భద్రతా బలగాలతో అక్కడి ప్రజలు మాత్రమే పోరాడగా.. ఇప్పుడు రాజకీయ నేతలు సైతం పోరాటం చేస్తున్నారు. దీంతో కేంద్రం ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఇవాళ తొలి అడుగు వేయబోతోంది.
భేటీపై భారీ అంచనాలు
ప్రధానితో ఇవాళ జమ్ము కశ్మీర్ నేతలు జరిపే చర్చల్లో ప్రతిష్టంభన తొలగించేందుకు తొలి అడుగు మాత్రం పడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటే మాత్రం ఎవరి వద్దా కచ్చితమైన సమాధానం లేదు. అయినా ప్రధాని జమ్ము-కశ్మీర్ నేతలతో సానుకూల వైఖరితో చర్చించేందుకు సిద్ధంగా ఉండటంతో.. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు వెలువడచ్చని తెలుస్తోంది. అయితే కశ్మీర్ రాజకీయ నేతల తాజా వైఖరి తెలుసుకునేందుకే ప్రధాని ఈ భేటీ ఏర్పాటు చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
రాష్ట్ర హోదా కష్టమేనా?
ప్రధాని మోడీ ఎప్పుడైతే జమ్ముకశ్మీర్ నేతల్ని చర్చలకు పిలిచారో అప్పటి నుంచి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఇవాళ్టి భేటీ తర్వాత రాష్ట్ర హోదా ప్రకటించే అవకాశాలు లేవని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే జమ్మూ-కశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ప్రకటనకు కొంత సమయం పట్టవచ్చని చెప్పింది. ఇప్పటికీ కేంద్రం అదే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తే మాత్రం రాష్ట్ర హోదా కల్పించే విషయాన్ని ఆలోచిస్తామని జమ్ము-కశ్మీర్ నేతలకు ప్రధాని చెప్పే అవకాశముంది.