జయలలిత నెచ్చెలి డిశ్చార్జ్..అయినా: హైదరాబాద్ లేదా బెంగళూరులో రెస్ట్: చెన్నై వెళ్లడంపై
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత అనుంగు నెచ్చెలి, ఉద్వాసనకు గురైన ఏఐఏడీఎంకే అధి నాయకురాలు వీకే శశికళ.. డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆమె బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన శశికళకు కరోనా వైరస్ సోకింది. ఫలితంగా- జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె చెన్నైకి బయలుదేరి వెళ్లలేకపోయారు. ఆమెను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమయంలో దినకరన్ ఆమె వెంటే ఉన్నారు. ఆసుపత్రి నుంచి నేరుగా బెంగళూరు శివార్లలోని నంది హిల్స్ సమీపంలోని ఓ రిసార్ట్కు వెళ్తారని తెలుస్తోంది. అక్కడ విశ్రాంతి తీసుకుంటారని, సోమవారం నాడు చెన్నైకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. కరోనా వైరస్ బారిన పడటం వల్ల ఈ నెల 21వ తేదీన బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం అధికారులు ఆమెను విక్టోరియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడే ఉంటూ చికిత్స పొందారు.
#WATCH | Expelled AIADMK leader VK Sasikala discharged from Victoria Hospital in Bengaluru, Karnataka.
— ANI (@ANI) January 31, 2021
She was admitted to the hospital with the complaint fever last week and was later diagnosed with COVID-19. pic.twitter.com/AyapUI4Y1T
శనివారం సాయంత్రం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సందర్భంగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ ఉదయం కూడా మరోసారి పరీక్షలను నిర్వహించారు. అందులోనూ నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. జ్యోతిష్యుడి సూచనలను ఆమె పాటించదలచుకుంటే మాత్రం.. చెన్నై వెళ్లడానికి మరి కొంత సమయం పట్టొచ్చు. ఫిబ్రవరి 3, 5, 8, 11 తేదీల్లో మాత్రమే చెన్నైకి వెళ్తే అంతా శుభం జరుగుతందంటూ తిరువణ్నామలైకి చెందిన ఆ జ్యోతిష్యుడు సూచించారు.
దీనికి అనుగుణంగా ఆమె తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. చెన్నైకి ఎప్పుడు వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదంటూ దినకరన్ వెల్లడించారు. ప్రస్తుతం శశికళకు విశ్రాంతి అవసరమని తేల్చారు. దీనికోసం నంది హిల్స్ శివార్లలోని రిసార్ట్ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె బెంగళూరు లేదా హైదరాబాద్లోని ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటారనే ప్రచారం ఉంది.