చైనా నిఘాపై కేంద్రం సీరియస్- నిపుణుల కమిటీతో దర్యాప్తు- నెల రోజుల్లో నివేదిక...
భారత్లోని రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులపై చైనాకు చెందిన ఓ ప్రైవేటు సంస్ధ నిఘా పెట్టిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో వీఐపీలు వాడుతున్న ఆన్లైన్ పరికరాలపై నిఘా పెట్టి కీలక సమాచారం హ్యాక్ చేస్తోందంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన విదేశాంగమంత్రి జై శంకర్ ఈ వ్యవహారంలో సీరియస్గా ఉన్నామని, దర్యాప్తు కోసం నిపుణుల కమిటీని నియమించినట్లు సమాధానం ఇచ్చారు. ఈ కమిటీ సమగ్ర విచా్రణ జరిపి నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుందని వెల్లడించారు.
Recommended Video
చైనా మైండ్గేమ్..ఆర్ట్ ఆఫ్ వార్: బోర్డర్లో లౌడ్ స్పీకర్లు.. పంజాబీ పాటలు: చెవులు చిల్లులు పడేలా
చైనా నిఘాపై కేంద్రం ఆగ్రహం...
సరిహద్దుల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్లోని కీలక వ్యక్తుల నుంచి ప్రైవేటు సమాచారాన్ని రాబట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు తాజాగా బయటపడ్డాయి. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భారత్లోని వీఐపీలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులకు చెందిన కార్యకలాపాలపై చైనాలోని షెంజాన్కు చెందిన ఝెన్హువా అనే ప్రైవేటు సంస్ధ ప్రయత్నిస్తున్నట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఈ సంస్ధ భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 2.4 మిలియన్ల మందిపై ఆన్లైన్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భారతీయులే అత్యధికంగా ఉన్నారని తేలడంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. డ్రాగన్ కంట్రీ కుటిల యత్నాలను ఆదిలోనే తిప్పికొట్టేందుకు వీలుగా నిఘా వ్యనహారాన్ని తేల్చేందుకు హైలెవల్ నిపుణుల కమిటీని నియమించింది.
చైనా రాయబారి వివరణ కోరిన కేంద్రం..
షెంజాన్కు చెందిన ఝెన్హువా సంస్ధ భారత్లోని వీఐపీలపై నిఘా పెట్టిందన్న వార్తల నేపథ్యంలో ఆ దేశ రాయబారి సన్ వీడాంగ్ను కేంద్రం వివరణ కోరింది. అయితే వీడాంగ్ ఈ సంస్ధతో చైనా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. అదో ప్రైవేటు సంస్ధ మాత్రమేనని వీడాంగ్ కేంద్రానికి తెలిపారు. సదరు సంస్ధ ఎలాంటి నిఘా పెట్టదని, కేవలం ఆన్లైన్లో ఓపెన్గా దొరికే సమాచారాన్ని క్రోడీకరిస్తుందని పేర్కొన్నారు. సైబర్ నేరాలను చైనా ఎప్పటికీ ప్రోత్సహించబోదన్నారు. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వడంతో పాటు దర్యాప్తు కమిటీకి కూడా సహకరించాలని కేంద్రం చైనా రాయబారిని కోరినట్లు తెలుస్తోంది.
హై లెవల్ నిపుణుల కమిటీ దర్యాప్తు..
మరోవైపు భారత్లోని వీఐపీలపై చైనా సంస్ధ నిఘా వ్యవహారాన్ని విపక్ష కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రెండు రోజుల క్రితం రాజ్యసభలో ప్రస్తావించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి రాసిన లేఖల కోరారు. దీనిపై స్పందించిన విదేశాంగమంత్రి జై శంకర్ దీనిపై సమాధానం పంపారు. భారత్లోని వేలాది మంది రాజకీయ నేతలు, వీఐపీల కార్యకలాపాలపై చైనాలోని ప్రైవేటు సంస్ద నిఘా పెట్టిన వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్గానే ఉందని విదేశాంగమంత్రి జై శంకర్ చెప్పినట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. దీనిపై ఓ అత్యున్నత స్ధాయి నిపుణుల కమిటీని కూడా నియమించామని, నెల రోజుల్లో ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నివేదిక అందించేలా కేంద్రం నుంచి కమిటీకి ఆదేశాలు వెళ్లాయని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.