సీఎం కేసీఆర్ సంకల్పంపై ‘ఎన్ఎంసీ’ కత్తి: సర్కారీ దవాఖానల నిర్వహణ ‘పైవేట్’కే
హైదరాబాద్/ న్యూఢిల్లీ: తెలంగాణ ఆవిర్భవించి మూడున్నరేళ్లు దాటింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దార్శనికతతో సర్కారీ దవాఖానల్లో పేదలకు వైద్య సేవలు బాగా అందుబాటులోకి వస్తున్నాయి. 'డబ్బు సంపాదన' ధ్యేయంగా పని చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో చేరి వల్లుగుల్ల చేసుకోకూడదనే మహాత్తర ఆశయంతో సీఎం కేసీఆర్.. ప్రత్యేకించి గర్భిణులకు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స.. ప్రసవం చేయించుకుంటే 'సీఎం కేసీఆర్ కిట్' పేరిట రమారమీ రూ.13 వేల విలువైన వస్తువులు కూడా సరఫరా చేస్తున్నారు. సర్కారీ దవాఖానల పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న అభిమానం.. పేదలకు తేలిగ్గా అందుబాటులోకి వైద్య సేవలు తేవాలన్న సంకల్పం ఎంతో కాలం సాగే అవకాశాలు లేవా? అన్న సందేహాలు వెల్లడవుతున్నాయి.
ఆ సందేహానికి ఎందుకంటే గతవారం కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్.. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన 'నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కారణం. అది ప్రస్తుతం మరోసారి పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయానికి సిఫారసు చేశారు. అది వేరే సంగతనుకోండి. కానీ పూర్తిగా వైద్యరంగానికి ప్రైవేట్ శక్తులకు అప్పగించడానికే వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లు - 2017 తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్ఎంసీలో సామాజిక రంగానికి ప్రాతినిధ్యం కొరవడిందన్న విమర్శలు
‘ఎన్ఎంసీ' చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అప్పగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నదని ‘ఎన్ఎంసీ' బిల్లు చెబుతోంది. ఈ అంశాన్ని గుర్తించినందునే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)తో అనుబంధం గల వైద్యులంతా ఆందోళన బాట పట్టారు. 12 గంటల ఔట్ పేషంట్ విభాగంలో వైద్య సేవలను నిలిపేశారు. పలుచోట్ల ఆందోళనకు దిగారు. వైద్యుల తీవ్రమైన ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు వ్యతిరేకించడానికి తోడు వైద్యుల ఆందోళనతో బిల్లును తదుపరి చర్చించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపింది. ప్రతిపాదిత నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)లో సామాజిక రంగానికి ప్రాతినిధ్యం కొరవడిందని వైద్యులు, వైద్య నిపుణులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఎన్ఎంసీ బిల్లు పలు లోపాలకు నిలయం
వైద్య రంగంలో స్వీయ నియంత్రణ విధానం విఫలమైందని, ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ, భిన్నమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ చర్య సరైన దిశలోనే సాగుతున్నదన్నారు. ప్రతిపాదితన ఎన్ఎంసీ బిల్లులో పలు లోపాలు ఉన్నాయన్నారు. వాటిల్లో ఒకటి ప్రభుత్వ, ప్రజా, సామాజిక రంగ ప్రాతినిధ్యం లేకపోవడం కూడా అని చెప్పారు. సామాజిక రంగ ప్రాతినిధ్యం లేకపోవడం తనను ఆశ్చర్య పరిచిందని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం వైద్యులు స్వతంత్రంగా తమ పనితీరును నియంత్రించుకుంటారు. అందుకోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లో వారికి ప్రాతినిధ్యం ఉంటుంది. ఎంసీఐలో పొరపాట్లు, అసంబద్ధ నిబంధనలు, కాలం చెల్లిన మార్గదర్శకాల స్థానే 92వ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇచ్చిన నివేదిక మేరకు కొత్తగా ప్రతిపాదిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ముందుకు వచ్చింది.
ప్రైవేట్ కాలేజీల్లో 40 శాతం సీట్లపైనే ప్రభుత్వ నియంత్రణ
ఆరోగ్య పరిరక్షణ రంగంలో అవకతవకలు, లోపాలను నివారించడంతోపాటు అవినీతిమయమైన ఎంసీఐకి బదులు ఎన్ఎంసీ అమలులోకి వస్తుంది. వైద్య విద్య నియంత్రణ బాధ్యత ఎవరిదన్న విషయమై స్పష్టత కొరవడింది. గత చట్టంతో పోలిస్తే ప్రస్తుత బిల్లులో చాలా లోపాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎంసీఐలో అంతర్లీనంగా ఉన్న అవినీతి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు భారీగా ఫీజులు వసూలు చేసేందుకు అనుమతినిస్తున్నదని హెల్త్ నెట్ వర్క్ పరిధిలోని స్వచ్ఛంద సంస్థ ‘జన్ స్వస్థ అభియాన్ ప్రతినిధి డాక్టర్ అభయ్ శుక్లా అభిప్రాయ పడ్డారు. ఈ కమిషన్ చట్టం అమలులోకి వస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు 60 శాతం సీట్లు తమ ఇష్టానుసారంగా భర్తీ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. కేవలం 40 శాతం సీట్లు మాత్రమే ప్రభుత్వ నియంత్రణలో భర్తీ అవుతాయి. మిగతా సీట్లన్నీ డొనేషన్ల పేరిట భారీ స్థాయిలో అవినీతి, అనైతిక పద్ధతులకు తెర తీస్తుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీప భవిష్యత్లో ఒక ప్రైవేట్ కాలేజీలో సీటు పొంది వైద్యుడయ్యేందుకు రూ.50 లక్షల నుంచి రూ. కోటి చెల్లించాల్సి వస్తుంది.
ఉత్తర భారతానికి వైద్యవిద్య విస్తరించాలని స్థాయీ సంఘం సిఫారసు
వైద్య విద్యారంగ వసతుల విషయమై పార్లమెంటరీ స్థాయీ సంఘం మరో అంశాన్ని లేవనెత్తింది. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే వైద్య విద్యా కాలేజీలు ఎక్కువగా ఉన్నాయని, ఉత్తర భారతంలో విస్తరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. ఏది ఏమైనా ప్రస్తుతం జిల్లాల స్థాయిలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మెడికల్ కాలేజీలను మెడికల్ కాలేజీలు నడుపుతున్న ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలన్న ప్రతిపాదన అందరికీ ఆమోద యోగ్యమన్న వాదన కూడా ఉన్నది. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల నిర్వహణ వల్ల వాటిపై ఆధారపడి వైద్య సేవలందుకుంటున్న పేదలకు ఉచితంగా సర్వీసు అందుబాటులోకి ‘ఆరోగ్య పరిరక్షణ' లభిస్తుందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. కానీ ప్రభుత్వ దవాఖానల నిర్వహణ బాధ్యతను స్వీకరించే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాయన్న అభిప్రాయం అంత తేలిక్కాదు. ఎందుకంటే ప్రైవేట్ శక్తులు నిత్యం లాభార్జనే ధ్యేయంగా పని చేస్తాయన్నది ఆచరణలో ప్రతి రంగంలోనూ కనిపిస్తున్న నిజం.
ఎన్ఎంసీ నిబంధనలు పరిధి దాటతాయేమోనని అనుమానాలు
ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఇచ్చిన తొలి సందేశం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ రంగ బాధ్యతలు నిర్వహించాల్సిన సర్కారీ దవాఖానలు నిద్రావస్థలో ఉన్నాయన్నది వాస్తవమే. కాకపోతే మీడియా వల్ల ఒకింత అప్రమత్తతతో కూడిన వైద్య సేవలందుతున్నాయి. భారత వైద్య మండలి (ఎంసీఐ) పనితీరుతో విసిగిపోయిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రం ప్రతిపాదించిన ‘ఎన్ఎంసీ'ముసాయిదా బిల్లుకు పూర్తిగా మద్దతు తెలిపాయి. ఎన్ఎంసీలో చేర్చిన నిబంధనలు, సామర్థ్యానికి భిన్నంగా.. దాని పరిధులు దాటుతుందేమోనని నిపుణలు ఆందోళన చెందుతున్నారు. ఎన్ఎంసీ కీలకంగా నిర్వర్తించాల్సిన పనుల్లో ఒకటి దేశంలోని వైద్య పరిశోధనలు కూడా ఉన్నాయి. విస్త్రుత ప్రాతిపదికన ఆరోగ్య పరిశోధన శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలో వైద్య పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
వైద్య విద్యా ప్రమాణాలు కనుమరుగయ్యే చాన్స్
ఆరోగ్య పరిరక్షణ రంగంలో మౌలిక వసతుల కల్పన ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత ‘ఎన్ఎంసీ'ల్లో ఒకటి. ఎన్ఎంసీ చట్టంగా మారితే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ప్రాక్టీస్ చేపట్టడానికి ముందు ప్రతిపాదించిన ‘ఎగ్జిట్' పరీక్షతో ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రమాణాలు, వసతులు, అవసరాలపై ఏమాత్రం తనిఖీ చేయకుండా ఎన్ఎంసీ కొత్త కాలేజీల ప్రారంభానికి అనుమతులు ఇస్తే కొత్తగా ఎంబీబీఎస్ కోర్సు చదివే వారికి మౌలిక వసతులు లభించక వైద్యవిద్యలో ప్రమాణాలు పడిపోతాయని నిపుణులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అల్లోపతి ప్రాక్టీస్కు అనుమతినిస్తే ఐఎంఏకు గిల్టీ ఇలా
‘ఎన్ఎంసీ'లో అల్లోపతి వైద్యం ప్రాక్టీస్ చేపట్టేందుకు ప్రతిపాదించిన నిబంధనలు.. అల్లోపతి (ఆధునిక వైద్యం) వైద్యం అందించే వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) గిల్టీగా పని చేయాల్సి వస్తుందని సామాజిక కార్యకర్త అభయ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ‘ఆయుష్' విద్యాభ్యాసం చేసిన వారిని ప్రమోట్ చేయాలన్న సంకల్పంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తే ఆ వైద్యులకు సరైన మౌలిక వసతులు, శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మందులు అందుబాటులో ఉంచాలి. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆయుష్ వైద్యులకు అల్లోపతి వైద్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్ సీ)ల్లో వైద్యుల కొరత పరిష్కరించొచ్చని ప్రభుత్వ యోచన. పట్టణాల్లోని దవాఖానల్లో భారీగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి' అని అన్నారు.