కరోనా పురోగతి ఎలావుంది?, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి: ఉత్పత్తిదారులతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు ఔషధ సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం భేటీ అయ్యారు. జెనోవా బయో ఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Recommended Video
కరోనా టీకా పురోగతిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. వ్యాక్సిన్ ప్రయోగాలు, సామర్థ్యం తదితర వివరాలను ప్రజలకు అర్థమయ్యేలా సాధారణ భాషల్లో చెప్పేందుకు ప్రయత్నించాలని ప్రధాని సంస్థల ప్రతినిధులను కోరినట్లు తెలిపింది. టీకా అభివృద్ధికి ఉన్న ఇతర అవకాశాల గురించి కూడా మోడీ అడిగి తెలుసుకున్నట్లు, దీనిపై చర్చించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
కరోనా వ్యాక్సిన్ రవాణా, భద్రత, పంపిణీపై చర్చించినట్లు పేర్కొంది. కరోనా టీకా రెగ్యులూటరీ ప్రక్రియ తదితర అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని సూచించినట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి జెనోవా బయో ఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అభినందించారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి మాత్రం మరోసారి పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. గత శనివారం ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్ పురోగతిపై పరిశీలించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని జైడస్ క్యాడిల్లా, హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని సందర్శించి, టీకా ప్రయోగాల వివరాలను తెలుసుకున్నారు. సంస్థలను పరిశీలించారు.