కరోనా ఎఫెక్ట్.. ఎక్కడివారు అక్కడే ఉండండి.. ప్రభుత్వ కీలక సూచన
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆంక్షలు అమలుచేస్తోంది. ముఖ్యంగా కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతించట్లేదు. అలాగే ఇరాన్ లాంటి దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం అక్కడి ఇండియన్ మెడికల్ టీమ్ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. వీలైనంతవరకు ఎక్కడున్న భారతీయులు అక్కడే ఉండాలని.. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని తెలిపారు.
విమానాల రాకపోకలకు సంబంధించి ఎయిర్లైన్స్కు తాము ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని వెల్లడించారు. అది వాణిజ్యానికి సంబంధించిన విషయమని.. వారి నిర్ణయానికే వదిలేస్తున్నామని తెలిపారు. ఇక ఐపీఎల్,ఇతర క్రీడా సంబంధిత ఈవెంట్లపై స్పందిస్తూ.. స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించాలా వద్దా అన్న నిర్ణయం వారికే వదిలేస్తున్నామని చెప్పారు. ఇలాంటి తరుణంలో స్పోర్ట్స్ ఈవెంట్స్ సరికాదనే తాము చెబుతున్నామని చెప్పారు.
కరోనా నియంత్రణ కోసం ఇరాన్,భూటాన్,మాల్దీవ్స్,ఇటలీ దేశాలు భారత్ సహాయాన్ని కోరినట్టు తెలిపారు. మాస్కులు,ఇతర రక్షణ పరికరాలను ఆయా దేశాలు భారత్ నుంచి కోరుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని.. ఇంతకుముందు చైనా కూడా భారత్ నుంచి సాయాన్ని కోరిందని తెలిపారు. గడిచిన 20 రోజుల్లో విదేశాల నుంచి భారత్కు వస్తున్న ప్రయాణికుల సంఖ్య 40శాతానికి పడిపోయిందని హోంమంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ అనిల్ మాలిక్ వెల్లడించారు.
కాగా,కరోనా వైరస్ కారణంగా ఢిల్లీ,మహారాష్ట్ర,కర్ణాటక,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే మాల్స్,థియేటర్స్,విద్యా సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. వైరస్ కారణంగా ఆక్యుపెన్సీ తగ్గడంతో 76 రైళ్లను రద్దు చేశారు. మహారాష్ట్రలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆదేశించారు. ఒకవేళ ప్రజలు ప్రభుత్వ సూచనలు,సలహాలు పాటించకుండా అనవసర ప్రయాణాలు చేస్తే.. రైళ్లు,బస్సులను బంద్ చేయడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.