సెంట్రల్ విస్టా: అసలేంటీ ప్రాజెక్టు... ఏం నిర్మించనున్నారు... ఇందులో హైలైట్స్ ఏంటి..
దేశ రాజధాని ఢిల్లీలోని లుట్యెన్స్ జోన్లో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేయనున్నారు. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం,కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3కి.మీ రాజ్పథ్ పునరుద్దరణ చేపట్టనున్నారు. అలాగే పలు నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్నారు.
డిసెంబర్ 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన జరగనుంది. అయితే శంకుస్థాపన మినహా ఇప్పుడే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం.
పార్లమెంట్ నిర్మాణం...
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే ఇది చాలా పెద్దది. ఇందులో లోక్సభ సుమారు 888 సీట్లు, రాజ్యసభ 384 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉభయ సభల్లో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుంది. భవిష్యత్తులో దేశంలో లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నందునా... ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉండేలా పార్లమెంటు నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత లోక్సభలో 545 సీట్లు,రాజ్యసభలో 245 సీట్లు ఉన్న సంగతి తెలిసిందే.
కానిస్టిట్యూషన్ హాల్...
కొత్త పార్లమెంట్ భవనంలో భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించే భారీ కానిస్టిట్యూషన్ హాల్ ఉంటుంది. రాజ్యాంగానికి సంబంధించిన ఒరిజినల్ కాపీని ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే భారతీయ ప్రజాస్వామ్య వారసత్వాన్ని చాటిచెప్పేలా డిజిటల్ డిస్ప్లేను సందర్శకుల గ్యాలరీలో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ హౌస్ను అలాగే ఉంచి అవసరమైన పార్లమెంటరీ కార్యక్రమాల కోసం వాడుతారు. కాగిత రహిత కార్యాలయాల దిశగా కొత్త పార్లమెంట్ భవనంలో డిజిటల్ ఇంటర్ఫేస్లు ఏర్పాటు చేయనున్నారు.
2024 నాటికి పూర్తి...
లోక్సభ సెక్రటేరియట్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, సిపిడబ్ల్యుడి, ఎన్డిఎంసి,ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ / డిజైనర్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. కొత్త పార్లమెంటు భవన సముదాయం 2022 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం 2024 నాటికి పని పూర్తయ్యే అవకాశం ఉంది.అదే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఉపరాష్ట్రపతి కొత్త నివాసాన్నిసెంట్రల్ సెక్రటేరియట్ నార్త్ బ్లాక్ సమీపంలోకి, ప్రధాని నివాసం, కార్యాలయాన్ని సౌత్ బ్లాక్ సమీపంలోకి తరలించే అవకాశం ఉంది.
సుప్రీం షాక్...
కేంద్రం నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కొన్ని వేల పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్టు పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు... నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసుకోవచ్చునని,అయితే ఇప్పుడే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది.అలాగే చెట్లను నరికివేయడం,కూల్చివేయడం చేయరాదని చెప్పింది. తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.