పుల్వామా ఉగ్రదాడి : మరో ఉగ్రవాది అరెస్ట్.. ఎన్ఐఏ విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడికి సంబంధించి జాతీయ విచారణ సంస్థ(NIA)తాజాగా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఉగ్రదాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలను ఓ ఆన్లైన్ డెలివరీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినట్టు గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ గ్రూపుకు చెందినవాడిగా అనుమానిస్తున్న షకీర్ బషీర్ మాగ్రేను పుల్వామాలో ఎన్ఐఏ అరెస్ట్ చేయడంతో ఈ విషయాలు బయటపడ్డాయి.
విచారణలో మాగ్రే ఏం వెల్లడించాడు..
ఎన్ఎస్ఏ విచారణపై మాట్లాడిన ఓ సీనియర్ అధికారి.. విచారణలో మాగ్రే పేలుడు పదార్థాల కొనుగోళ్ల గురించి వెల్లడించినట్టు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన బ్యాటరీ,అమోనియం నైట్రేట్ పదార్థాలను ఆన్లైన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసినట్టు చెప్పారు. అంతేకాదు,పుల్వామాలో జవాన్లపై దాడి చేసినరోజు... పేలుడు పదార్థాలు నింపిన మారుతీ ఎకో వాహనాన్ని మాగ్రే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకున్నాడన్నారు. జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్కి 500మీ. దూరంలో అతను వాహనం నుంచి దిగిపోయాడని.. ఆ తర్వాత ఆదిల్ అహ్మద్ కారును డ్రైవ్ చేశాడని చెప్పారు.
వారికి ఆశ్రయం కల్పించిన మాగ్రే
నిందితుడు మాగ్రేను శుక్రవారం ఎన్ఐఏ కోర్టు ఎదుట ప్రవేవపెట్టారు. న్యాయస్థానం అతనికి 15 రోజులు రిమాండ్ విధించింది. పుల్వామా దాడిలో మాగ్రే కీలక కుట్రదారి అని ఎన్ఐఏ వెల్లడించింది. అంతేకాదు,ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్ అహ్మద్తో పాటు పాకిస్తానీ ఉగ్రవాది మహమ్మద్ ఉమర్ ఫరూక్కు అతను ఆశ్రయం కల్పించాడని,అందుకోసం వాహనాన్ని కూడా అతనే సమకూర్చాడని చెప్పారు. 2018 చివరి నుండి 2019 ఫిబ్రవరిలో దాడి జరిగేంతవరకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడన్నారు.
కాన్వాయ్ కదలికలపై మాగ్రే నిఘా
'మాగ్రే నిర్వహిస్తున్న ఫర్నిచర్ దుకాణం లెత్పోరా వంతెన సమీపంలో ఉంది. మహమ్మద్ ఉమర్ సలహా మేరకు జమ్మూకశ్మీర్ హైవేపై జనవరి 2019లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ కదలికలను మాగ్రే గమనించడం మొదలుపెట్టాడు. కాన్వాయ్కి సంబంధించి ఎప్పటికప్పుడు మహమ్మద్ ఉమర్,ఆదిల్ అహ్మద్లకు సమాచారం చేరవేసేవాడు. పేలుడుకి ఉపయోగించిన మారుతీ ఎకోకు మార్పులు చేయడంలో,దానికి ఐఈడీ పేలుడు పదార్థాలను అమర్చడంలోనూ అతని ప్రమేయం ఉంది.' అని ఎన్ఐఏ స్టేట్మెంట్లో వెల్లడైంది.
పాక్ మీదుగా భారత్కు ఆర్డీఎక్స్
మహమ్మద్ ఆదిల్,మహమ్మద్ ఉమర్ ఫరూక్లతో పాటు ఐఈడీ పేలుళ్లలో నిపుణుడైన కమ్రాన్కు పుల్వామా ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నట్టుగా ఎన్ఐఏ వెల్లడించింది. మార్చి,2019 ఎన్కౌంటర్లో కమ్రాన్,ఫరూక్ ఇద్దరూ మృతి చెందారు. ఆ సమయంలో కమ్రాన్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకోగా.. అందులో ఆర్డీఎక్స్ పేలుళ్ల తయారీకి సంబంధించిన వీడియోలను కనుగొన్నారు. పేలుడుకు ఉపయోగించిన 80కేజీల ఆర్డీఎక్స్ను పాకిస్తాన్ మీదుగా భారత్కు తరలించి ఉండవచ్చునని ఎన్ఐఏ అనుమానిస్తోంది. విచారణళో మాగ్రే నుంచి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.