ఉల్లి పాయల ధరలను తగ్గించడానికి కేంద్రం సంచలన నిర్ణయం: ఎట్టకేలకు దానిపై నిషేధం!
న్యూఢిల్లీ: కొనకముందే కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి పాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తక్షణ చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా ఉల్లి పాయలు ధరలు పెరిగి.. ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రేట్లను తగ్గించే దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉల్లి పాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అన్ని రకాల ఉల్లి పాయల ఎగుమతులకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రకటించింది.
కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి పాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఉల్లి పాయలు కేజీ ఒక్కింటికి 80 నుంచి 90 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని రాష్ట్రాల్లో 100 మార్క్ ను కూడా అందుకుంది. దేశంలోనే అత్యధికంగా ఉల్లి పాయలను పండించే మహారాష్ట్రలో భారీ వర్షాలు ఉల్లి పాయల రేట్లు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల చేతికి అందిన ఉల్లి పంట ఒక్కసారిగా నీటి పాలైంది. ఫలితంగా- దేశవ్యాప్తంగా వాటి కొరత ఏర్పడింది. డిమాండ్ కు అనుగుణంగా ఉల్లి పాయల సరఫరా లేకపోవడం వల్ల వాటి ధరలు అసాధారంగా పెరిగాయి.
దేశ రాజధాని సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఉల్లి పాయల ధరలు 90 రూపాయలకు చేరుకున్నాయి. ఈ సమస్య సుమారు నెలరోజుల నుంచీ నెలకొన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటి ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం గమనార్హం. ఉల్లి పాయల ఎగుమతులను నిషేధించింది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని రద్దు చేసింది. ఉల్లి పాయలను అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించడానికి వీలు లేకుండా వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు నిషేధం విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
మన రాష్ట్రంలో పండించే కేపీ ఉల్లి సహా దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో పండించే విభిన్న రకాల ఉల్లి పాయల ఎగుమతులకు ఈ నిషేధం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఉల్లి పాయల ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎగుమతులను నిషేధించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్ కు తరలి వెళ్లే ఉల్లి పాయలను దేశీయ మార్కెట్ లోనే విక్రయించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్ కు అనుగుణంగా సరఫరా ఉంటుందని, దీనికి అనుగుణంగా వాటి ధరలు కూడా తగ్గుతాయని వాణిజ్య శాఖ అధికారులు చెబుతున్నారు.