భారత నేవీ కీలక నిర్ణయం : సోషల్ మీడియాపై నిషేధం..
భారత నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యర్థి దేశాల హానీ ట్రాప్లో దేశ నేవీ సిబ్బంది చిక్కకుండా ఉండేందుకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఇకనుంచి నేవీ సిబ్బంది ఎవరూ ఫేస్బుక్ వంటి సోషల్ సైట్లకు దూరంగా ఉండాల్సిందే.
అలాగే నావల్ బేస్,డాక్యార్డ్,బోర్డ్ వార్షిప్లపై సిబ్బంది స్మార్ట్ ఫోన్లు వినియోగించడాన్ని కూడా నేవీ నిషేధించింది. దేశ రక్షణ రహస్యాలు సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులకు చేరుతుండటంతో ఈ నిర్ణయాలు తీసుకుంది.
ఈ నెల డిసెంబర్ 20న విశాఖలో ఏడుగురు నేవీ సిబ్బందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హానీ ట్రాప్లో చిక్కుకుని నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వీరు పాకిస్తాన్కు చేరవేసినట్టు గుర్తించారు. కేంద్ర నిఘా వర్గాలు, ఏపి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఈ నిజాలు బయటపడ్డాయి.
2017లో రిక్రూట్ అయిన ఈ ఏడుగురు సిబ్బంది ఫేస్బుక్ హానీ ట్రాప్లో చిక్కుకున్నారు.పాకిస్తాన్కి చెందిన ఓ యువతి లైంగికంగా వారిని ఆకర్షించడంతో.. ఆమెతో మాటలు కలిపారు. ఇదే క్రమంలో నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమెకు పంపించారు. ప్రస్తుతం దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు బయటపడటంతో.. నేవి సిబ్బందిని సోషల్ సైట్లకు దూరంగా ఉంచేలా నేవీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.