కోర్టు సంచలనం: స్వర్ణ శతాబ్ది రైలును రైతుకు ఇచ్చేయాలంటూ తీర్పు
లూథియానాలోని జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రైతు భూమిని తీసుకుని అతని తగిన నష్టపరిహారం చెల్లించని కారంణంగా ఉత్తరరైల్వేకు జిల్లా అడిషనల్ కోర్టు ఈ తీర్పుతో షాకిచ్చింది. అమృతసర్-న్యూఢిల్లీల మధ్య
ఛండీఘర్: లూథియానాలోని జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రైతు భూమిని తీసుకుని అతని తగిన నష్టపరిహారం చెల్లించని కారంణంగా ఉత్తరరైల్వేకు జిల్లా అడిషనల్ కోర్టు ఈ తీర్పుతో షాకిచ్చింది. అమృతసర్-న్యూఢిల్లీల మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ను రైతుకు ఇవ్వాలంటూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
న్యాయం చేయాలంటూ కోర్టుకు..
లూథియానా-ఛడీఘర్ రైల్వే లైను ఏర్పాటు కోసం ఉత్తర రైల్వే 2007లో భూ సేకరణ చట్టం కింద లూథియానాకు చెందిన సంపూరణ్ సింగ్ అనే రైతుకు చెందిన భూమిని తీసుకుంది. ఇందుకు గాను రూ.కోటికిపైగా నష్ట పరిహారం చెల్లించాల్సివుంది. అయితే, రూ.42 లక్షలు మాత్రమే సంపూరణ్కు చెల్లించింది ఉత్తర రైల్వే. దీంతో తనకు న్యాయం చేయాలంటూ 2012లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సంపూరణ్.
రైలు ఇచ్చేసిన కోర్టు
కేసును విచారించిన కోర్టు 2015 జనవరిలో పిటిషనర్కు రైల్వే ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేయాలని తీర్పు చెప్పింది. అప్పటికీ రైల్వే శాఖ స్పందించకపోవడంతో మరో మారు కోర్టు మెట్లె క్కాడు సంపూరణ్ సింగ్. ఈక్రమంలో కేసును విచారించిన లూథియానా జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి జస్పాల్ వర్మ... స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్(నెం-12030)ను రైతుకు ఇస్తున్నట్లు తీర్పు చెప్పారు.
కోర్టుకు రైలు..
ఈ క్రమంలో లూథియానా రైల్వే స్టేషన్కు కోర్టు ఆర్డర్తో చేరుకున్న సంపూరణ్ రైలును తనకు అప్పజెప్పాలని కోర్టు ఆర్డర్లను డ్రైవర్కు చూపించాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న సెక్షన్ ఇంజినీర్ ప్రదీప్కుమార్ రైలును కోర్టుకు స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రయాణీకులు ఉండటంతో సమస్యగా మారుతుందని రైలును ఆపలేదని సంపూరణ్ తెలిపారు.
ఇంటికి తీసుకెళ్తారా?
లూథియానా జిల్లా కోర్టు తీర్పుపై డివిజినల్ రైల్వే మేనేజర్ అనుజ్ ప్రకాశ్ స్పందించారు. నష్టపోయిన వారికి పరిహారాలు చెల్లించడంలో కొన్ని సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుందని తెలిపారు. రైలును రైతుకు ఇస్తే అతనేం చేసుకుంటాడని ఆయన ప్రశ్నించారు. కనీసం దాన్ని ఇంటికి కూడా తీసుకెళ్లగలరా? అని అన్నారు.