కరోనా స్ట్రెయిన్ భయం: బ్రిటన్కు విమాన సర్వీసుల రద్దు పొడిగింపు: ఎప్పటిదాకా?
న్యూఢిల్లీ: బ్రిటన్లో పుట్టుకొచ్చిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ భయాందోళనల మధ్య కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బ్రిటన్కు రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని పొడిగించింది. బ్రిటన్ నుంచి స్వదేశానికి వచ్చిన 20 మందిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించడంతో.. ఈ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: క్వారంటైన్: ఆరోగ్యంపై ఏం చెప్పారంటే..ఆ జిల్లాలో ఇలా
బ్రిటన్కు వచ్చేనెల 7వ తేదీ వరకూ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. ఇప్పుడున్న నిషేధాన్ని మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు వివరించారు. కరోనా వైరస్ బ్రిటన్లో సరికొత్త రూపాన్ని సంతరించుకోవడం..ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగిన విమానాల రాకపోకల ద్వారా స్వదేశానికి చేరిన వారిలో 114 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడటం, వారిలో 20 మందిలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కనిపించడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని నిషేధాన్ని వచ్చేనెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు.
బ్రిటన్కు విమాన సర్వీసులను మళ్లీ పొడిగించాలా? లేదా? అనే విషయాన్ని అప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని నిర్ధారిస్తామని అన్నారు. ఇటీవల యూకేలో కొత్త వేరియంట్ ఆనవాళ్లు కనిపించిన తర్వాత.. భారత్ సహా అనేక దేశాలు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. యూరోప్లోని కొన్ని దేశాలు ఇప్పటికే తమ సరిహద్దులను సైతం మూసివేశాయి. రాకపోకలను నిలిపివేశాయి. కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
బ్రిటన్ నుంచి 33 వేల మంది స్వదేశానికి చేరుకోగా.. వారిలో చాలామందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 20 మందిలో కరోనా వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. ఎన్సీడీసీ ఢిల్లీ-8, ఎన్ఐబీజీ కల్యాణి (కోల్కత)-1, ఎన్ఐవీ పుణే-1, నిమ్హాన్స్ బెంగళూరు-7, సీసీఎంబీ హైదరాబాద్-2, ఐజీఐబీలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వారందరికీ కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ సోకినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వారంతా ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంటున్నారు.