‘రంజాన్’ రిలీఫ్: ఖతార్ ఎఫెక్ట్తో దోహాకు భారత్ అదనపు విమానాలు
న్యూఢిల్లీ: పవిత్ర రంజాన్ పర్వదినం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దోహాకు తాత్కాలికంగా అదనపు విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఇలా అదనపు సర్వీసులు నడపాల్సిందిగా ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం కోరింది.
కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఖతార్ విమానాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ జూన్ 22, 23 తేదీల్లో ముంబై-దోహాల మధ్య 168 సీట్ల విమానాలు నడుపుతుంది.
ఎయిరిండియా అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ జూన్ 25 నుంచీ జులై 8వ తేదీ వరకూ తిరువనంతపురం-దోహా, కొచ్చిన్-దోహాల మధ్య 186 సీట్ల విమానాలను నడుపుతుందని పౌరవిమానయానశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అదనపు విమానాల అవసరంపై ఇటీవల పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్గజపతి రాజుతో చర్చించిన నేపథ్యంలో ఈ అదనపు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించారు.