ఇక.. ఆపరేషన్ చైనా! డ్రాగన్ ఆధిపత్యానికి చెక్, పావులు కదుపుతున్న భారత్!
హిందూ మహాసముద్రం మీద చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది.
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రం మీద చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు భారత్ వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి నిఘా డ్రోన్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
తాజాగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నౌకా దళ బలగాన్ని మరింత పెంచేందుకు కూడా మన దేశం సిద్ధమవుతోంది. సముద్ర జాలాల మీదుగా ఉగ్రవాదులు భారత్ పై విరుచుకుపడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో ఆ దిశగా అవసరమైన అన్ని రకాల చర్యలనూ భారత్ తీసుకుంటోంది.
హిందూ మహా సముద్రం.. నౌకా వాణిజ్యానికి అత్యంత కీలకం
హిందూ మహాసముద్రంపై భారత్-చైనాల మధ్య సాగుతోన్న ఆధిపత్య పోరు ఈనాటిది కాదు.. కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఎందుకంటే, హిందూ మహాసముద్రం... నౌకా వాణిజ్యానికి అత్యంత కీలకం. తాజాగా చైనా అధిపత్య పోరుకు చెక్ పెట్టే దిశగా భరత్ తన అడుగులు వేస్తోంది.
నౌకాదళ బలం మరింత పెంపు...
సముద్ర జలాల గుండా భారత్ కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్నది మన నిఘా వర్గాల తాజా సమాచారం. హిందూ మహాసముద్రం మీదుగా ఉగ్రవాదులు ఎప్పుడైనా.. ఎక్కడైనా విరుచుకుపడే ప్రమాదమున్నట్లు గుర్తించారు. దీంతో హిందూ మహాసముద్రంలో ఉన్న తమ నౌకాదళ బలగాన్ని మరింత శక్తివంతం చేసే దిశగా అవసరమైన చర్యలను భారత్ చేపట్టింది.
2027 నాటికి మరింత శక్తిమంతం...
ప్రస్తుతం భారత నౌకాదళంలో 138 యుద్ధనౌకలు, 235 ఎయిర్క్రాఫ్ట్ , హెలీకాప్టర్లు ఉన్నాయి. వీటి సంఖ్యను 2027 నాటికి భారీగా పెంచేందుకు నేవీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యుద్ధ నౌకలను 212కు, హెలీకాప్టర్ల సంఖ్యను 458 పెంచుకోవాలని.. నేవీ అధికారులు భావిస్తున్నారు.
24 గంటలూ యుద్ధనౌకల పహారా...
పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి మలాకా జలసంధి వరకూ.. 24 గంటలు మన యుద్ధనౌకలు పహారా కాసేలా.. కేంద్రం చర్యలు తీసుకుంటోంది. హిందూ మహాసముద్రంలో ప్రతిక్షణం కాపు కాసేందుకు 12 నుంచి 15 డెస్ట్రాయర్లు, భారీ, చిన్నపాటి యుద్ధనౌకలు, గస్తీ నౌకలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, నావల్ శాటిలైట్ అయిన జీశాట్-7తో అంతరిక్షణం నుంచి కూడా ఆ ప్రాంతంపై రియల్ టైమ్ నిఘా ఏర్పాటు చేయనున్నారు.
ఆధిపత్యం.. మన చేతుల్లోకి వచ్చినట్లే..
ప్రస్తుతం హిందూ మహాసముద్రాన్ని భారత్ దాదాపుగా తన అదుపులోకి తీసుకున్నట్లుగా భారత నౌకాదళం సీనియర్ అధికారులు చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఏడెన్, మలాకా జలసంధి వరకూ.. 24 గంటలు మిషన్ రెడీ వార్షిప్స్ తో భారత నౌకాదళం గస్తీ కాస్తోందని, ఏ చిన్న సహాయం, ఇతర అవసరాలు ఏర్పడ్డా నౌకాదళ అధికారులు వేగంగా స్పందిస్తారని వారు పేర్కొంటున్నారు.
ఎటునుంచి తోక జాడించినా...
ఉగ్రవాదులు ఎటునుంచి తోక జాడించినా తోక కత్తిరించేందుకు భారత నౌకాదళం సంసిద్ధంగా ఉంది. ప్రస్తుతం శివాలిక్ తరగతికి చెందిన భారత యుద్ధవిమానం బంగాళాఖాతంలో.. బంగ్లాదేశ్, మయన్మార్లవైపు గస్తీ కాస్తోంది. అలాగే టెగ్ తరగతికి చెందిన మరో యుద్ధ విమానం మడగాస్కర్, మారిషస్ చుట్టూ పహారా కాస్తోంది. ఐఎన్ఎస్ త్రిశూల్.. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, కోరో యుద్ధ నౌక అండమాన్ సముద్రంలో గస్తీ కాస్తున్నాయి.
సముద్ర జలాల్లోనూ కవ్విస్తోన్న చైనా?
చైనా హిందూ మహాసముద్ర జలాల్లోనూ భారత్ ను కవ్విస్తోంది. కొన్నేళ్లుగా చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు తరుచుగా హిందూ మహాసముద్ర జలాల్లోకి వచ్చి వెళుతున్నాయి. చైనాకు చెందిన అణు జలాంతర్గాములు కూడా ఈ మధ్య హిందూ మహాసముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. దీంతో భారత నౌకాదళం దీనిపై దృష్టిసారించింది. తమ గస్తీని మరింత బలోపేతం చేయడం ద్వారా చైనాకు చెక్ చెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.