దుస్తుల షాపులో రహస్య కెమెరాపై స్మృతి ఫిర్యాదు: నలుగురికి బెయిల్
పానాజీ: గోవాలోని ఫాబ్ ఇండియా దుస్తుల దుకాణంలో రహస్య కెమెరా వ్యవహారంపై పోలీసులు అరెస్టు చేసిన నలుగురికి బెయిల్ లభించింది. ఫాబ్ఇండియాకు చెందిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలసిందే. బట్టల దుకాణంలోని రహస్య కెమెరాను గుర్తించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
పరేష్ భగత్, రాజు పాయాంచే, ప్రశాంత్ నాయక్, కరీం లఖానీ అనే నలుగురిని పోలీసులు విచారణ నిమిత్తం అదుపోలికీ తీసుకున్నారు. వారిపై ఆ తర్వాత కేసులు నమోదు చేశారు. ఆ నలుగురికి కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్ను శనివారం మంజూరు చేసింది.
కాగా, ఈ కేసులో ఫాబ్ ఇండియా కాండోలిమ్ స్టోర్ మేనేజర్ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అది రహస్యమైన కెమెరా ఏమీ కాదని, అందరికీ కనిపించేట్లే ఏర్పాటు చేశామని ఫాబ్ ఇండియా వాదిస్తోంది.
గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూంలో దుస్తులు మార్చుకునే గదిలో (చేంజింగ్ రూం)లో స్పై కెమెరా అంశాన్ని గోవా ప్రభుత్వం, పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రస్తుతం బెంగళూరు బీజేపీ సమావేశాల్లో ఉన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఆయన బెంగళూరు నుండే హామీ ఇచ్చారు.
బెంగళూరు సమావేశాల నుండే పోలీసులను ఆదేశించారు. దుకాణం యజమాని పైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, బెంగళూరు పోలీసులు ప్యాబ్ ఇండియా షోరూంను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. థర్మాకోల్ వెనుకాల సీసీ కెమెరా పెట్టినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. షోరూంలో ఉన్న కంప్యూటర్లు, సర్వర్లు, హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.