జామియా షూటర్ రామ్భక్త్ గోపాల్ ఖాతాను తొలగించిన ఫేస్బుక్..
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడ్డ రామ్భక్త్ గోపాల్ ఫేస్బుక్ ఖాతాను ఫేస్బుక్ యాజమాన్యం తొలగించింది. ఈ రకమైన హింసకు పాల్పడేవారికి ఫేస్బుక్లో స్థానం ఉండదని.. అందుకే అతని ఖాతాను తొలగిస్తున్నామని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. రామ్భక్త్ గోపాల్ విద్వేషపూరిత పోస్టులను ప్రోత్సహించినవారి ఖాతాలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే వారి ఖాతాలను గుర్తించి తొలగిస్తామన్నారు. జామియా మిలియా యూనివర్సిటీలో కాల్పుల తర్వాత రామ్భక్త్ గోపాల్ ఫేస్బుక్ టైమ్ లైన్పై రైట్ వింగ్ కార్యకర్తలు,మద్దతుదారులు పెద్ద ఎత్తున అతన్ని అభినందించారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ అతని ఖాతాను తొలగించింది.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్తో మాట్లాడారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ను ఆదేశించారు. ఇలాంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.
కాగా,జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఘటనకు ముందు రామ్భక్త్ గోపాల్.. 'షాహీన్బాగ్ ఖేల్ ఖతమ్..' అంటూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. అంతేకాదు,తన అంతిమయాత్రలో తన శవంపై కాషాయ జెండా కప్పాలని,జైశ్రీరామ్ నినాదాలు చేయాలని పేర్కొన్నాడు. అతని వ్యాఖ్యలకు రైట్ వింగ్ మద్దతుదారుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తగా.. మరికొంతమంది మాత్రం టెర్రరిస్టు అంటూ విమర్శించారు. వర్సిటీలో కాల్పుల సమయంలో 'ఇదిగో ఆజాదీ.. తీసుకోండి..' 'జైశ్రీరామ్..' అంటూ అతను కాల్పులకు పాల్పడ్డాడు. అతను ఉత్తరప్రదేశ్లోని బౌద్దనగర్ వాసిగా పోలీసులు గుర్తించారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.