భారత్లో మనకో విధానం లేదా ? ఫేస్ బుక్కు ఉద్యోగుల ప్రశ్నలు- అదేం లేదని వివరణ...
భారత్లో బీజేపీతో అంటకాగుతూ ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కంటెంట్ ను నియంత్రించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్ బుక్పై ఇప్పుడు ఆ సంస్ధ ఉద్యోగులే యుద్ధానికి దిగారు. సంస్ధలో అంతర్గతంగా తమకున్న అవకాశాన్ని వినియోగించుకుంటూ ఫేస్ బుక్ భారత్లో కంటెంట్ విషయంలో అనుసరిస్తున్న పాలసీపై విమర్శలకు దిగారు. ఇప్పటివరకూ బయటి వ్యక్తుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఫేస్ బుక్ ఇప్పుడు సొంత ఉద్యోగులే నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాంటిదేమీ లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది.
తలాతోకా లేని ఫేస్ బుక్ విధానం...
భారత్లో అమెరికన్ సామాజిక మాధ్యమాల దిగ్గజం ఫేస్ బుక్ అనుసరిస్తున్న విధానంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ భారత్లోని ఓ బీజేపీ నేత చేసిన పోస్టును ఫేస్ బుక్ వాల్పై యథాతథంగా ఉంచడంపై తీవ్ర విమర్శలు చేసింది. ఫేస్ బుక్ తమ విద్వేష వ్యాఖ్యల విధానాన్ని బీజేపీ నేతలకు వర్తింపజేయడం లేదని వాల్ స్ట్టీట్ జర్నల్ చేసిన విమర్శలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. దేశంలోని బీజేపీ నేతలతో సత్సంబంధాలు నడుపుతున్న భారత్లోని ఫేస్ బుక్ పెద్దలు బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలను ఎలా సమర్ధిస్తారంటూ నిపుణులు, మేథావులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఫేస్ బుక్ను తీవ్రంగా విమర్శిస్తోంది.
అంతర్గతంగా ఉద్యోగుల రచ్చ...
భారత్లో ఫేస్ బుక్ అనుసరిస్తున్న బీజేపీ అనుకూల వైఖరిపై వాల్స్ట్రీట్ జర్నల్ మొదలు పెట్టిన విమర్శలను ఇప్పుడు అందరూ అందుకున్నారు. భారత్కు బయట ఉంటున్న ఫేస్ బుక్ సంస్ధ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు. భారత్లో ఫేస్ బుక్ అనుసరిస్తున్న విధానం ఏంటి, దానికి ఎలాంటి ప్రమాణాలు లేవా అంటూ అంతర్గంతంగా మెయిల్స్ పంపడం మొదలుపెట్టారు. భారత్ లో ఫేస్ బుక్ లాబీయిస్టుగా ఉన్న అంఖీ దాస్తో పాటు ఫేస్ బుక్ యాజమాన్యానికి సైతం ఈ మెయిల్స్ వెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రిపోర్టు చేయడంతో అందరికీ తెలిసిపోయింది.
అదేం లేదంటున్న ఫేస్ బుక్ భారత్...
భారత్లో ఫేస్ బుక్ కార్యకలాపాలు అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అంటకాగుతున్నారన్న విమర్శలను దేశంలో ఆ సంస్ధ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న అంఖీ దాస్ సోదరి రష్మీ ఖండించారు. మా సోదరీమణులు ఇలాంటి వివాదాలు ఎన్ని ఎదురైనా తట్టుకునే పరిస్ధితుల్లో ఉన్నట్లు రష్మీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంఖీకి ఈ వివాదం నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసని రష్మీ వ్యాఖ్యానించింది. మరోవైపు ఫేస్ బుక్ ఇండియా హెడ్గా ఉన్న అజిత్ మోహన్ కూడా అంఖీ దాస్ను వెనకేసుకొచ్చారు. అంఖీను ఉద్దేశించి వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన వ్యాసం వాస్తవంగా ఆమె వైఖరికి అద్దం పట్టేలా లేదన్నారు. భారత్లో తాము బీజేపీతో అంటకాగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.