ఫేస్ బుక్ తీరుపై ఆందోళన - బీజేపీతో లింకుల మాటేంటి? - ఎండీని ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తుననదని... రాజకీ, ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ ఫేస్ బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ బుధవారం పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు.
Recommended Video
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చైర్మన్ గా ఉన్న ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ ఎదుట ఫేస్ బుక్ ఇండియా చీఫ్ వివరణ ఇచ్చుకున్నారు. ''పౌరుల హక్కుల పరిరక్షణ, సోషల్, ఆన్ లైన్ న్యూస్ మీడియా ప్లాట్ఫాఫ్ దుర్వినియోగాన్ని నిరోధించడం'' అనే అంశంపై థరూర్ కమిటీ ఫేస్ బుక్ ను ప్రశ్నలు అడిగింది. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు ఫేస్ బుక్ కొమ్ముకాస్తోందనే ఆరోపణలపైనా కమిటీ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
ఫేస్ బుక్ సంస్థకు ఏ దేశంలోనూ ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాల్లేవని, పక్షపాతంగా వ్యవహరించబోమని గతంలోనే ప్రకటించిన ఫేస్ బుక్ సంస్థ.. బుధవారం నాటి పార్టమెంటరీ కమిటీ విచారణలోనూ అదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. థరూర్ కమిటీ ఎలాంటి ప్రశ్నలు అడిగింది, వాటికి అజిత్ మోహన్ ఏం సమాధానాలిచ్చారనేది అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది.
భారత్ లో ఫేస్ బుక్ సంస్థ 2011 నుంచి బీజేపీకి అనుకూలంగా, ప్రజల్ని ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నదని ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జనరల్ ఇటీవల వరుస కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఆ కథనాల్లో కొన్ని పాయింట్లను మాత్రమే ఫేస్ బుక్ అంగీకరించింది. ఈ వివదంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు సార్లు సంస్థకు లేఖలు రాసింది. మంగళవారం కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ సైతం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కు ఘాటు లేఖ రాయడం, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రైట్ వింగ్ ఐడియాలజీపై ఫేస్ బుక్ ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.
ఫేస్ బుక్ ఉదంతంతోపాటు దేశంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ విచారించింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ అధికారులు కూడా కమిటీ ముందు హాజరయ్యారు. కాగా, ఫేస్ బుక్ పై పార్టీ లైన్ కు అనుగుణంగా కామెంట్లు చేసిన శశి థరూర్.. పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉండటం తగదని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే అభ్యంతరం వ్యక్తం చేయగా, స్పీకర్ మాత్రం కమిటీలో మార్పులకు అంగీకరించలేదు. దీంతో థరూర్ నేతృత్వంలోని కమిటీనే విచారణ చేపట్టింది.