ఫేస్బుక్ వివాదం: శశిథరూర్ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ బీజేపీ ఎంపీల డిమాండ్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వివాదం మరింత ముదిరిపోతోంది. భారత ఫేస్బుక్ కార్యకలాపాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛైర్పర్సన్ శశిథరూర్పై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అటు శశిథరూర్, ఇటు బీజేపీకి చెందిన నిశికాంత్ దూబే.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు.
తాజాగా, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పీకర్ ఓం బిర్లాకు మరో లేఖ రాశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛైర్పర్సన్ పదవి నుంచి శశిథరూర్ను తొలగించాలని ఆ లేఖలో కోరారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛైర్పర్సన్ పదవిలో ఉండి లోక్సభ రూల్స్ ఆఫ్ ప్రొసిజర్ అండ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రిలేషన్ రూల్ 258(3)లోని రూల్ 283కి విరుద్ధంగా శశిథరూర్ వ్యవహరించారని ఆరోపించారు.
నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించిన శశిథరూర్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఎంపీ దూబే కోరారు. సొంత పార్టీ ప్రయోజనాల కోసం తన పదవిని శశిథరూర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛైర్పర్సన్ పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదని అన్నారు.
మరో బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా స్పీకర్కు శశిథరూర్ వ్యవహారంపై లేఖ రాశారు. శశిథరూర్ తన వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా చెబుతూ.. ఫేస్బుక్కు సమన్లు జారీ చేయాలంటున్నారని తెలిపారు. పార్లమెంటరీ కమిటీలో చర్చించకుండా సొంత నిర్ణయాలు అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కమిటీ సభ్యులతో ఎలాంటి చర్చా జరపకుండా నేరుగా మీడియాతో మాట్లాడటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కాగా, వాల్స్ట్రీట్ జర్నల్లో భారత ఫేస్బుక్ కార్యకలాపాలపై ఓ సంచలన కథనం ప్రచురించింది. బీజేపీకి అనుకూలంగా భారత ఫేస్బుక్ వ్యవహరిస్తోందని, పలు వివాదాస్పద ప్రసంగాలను కూడా డిలీట్ చేయకుండా సంస్థ నిబంధనలను తుంగలో తొక్కుతోందని ఆరోపించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతోపాటు ఇతర నేతలు కూడా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేగాక, భారత ఫేస్ బుక్ కార్యకలాపాల పాలసీ హెడ్ ను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.