Facebook నుంచి మరో ప్రాజెక్టు... భారత్లో న్యూస్ సర్వీసులు..మీడియా పరిస్థితేంటి..?
ఢిల్లీ: భారత్లో మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్బుక్ ప్రయత్నాలు ప్రారంభించింది. భారత్తో పాటు బ్రెజిల్ ఫ్రాన్స్, జర్మనీ మరియు యూకేల్లో న్యూస్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో వార్తల ప్రసారం ఫేస్బుక్ ప్రారంభించింది. ఇది సక్సెస్ కావడంతో భారత్తో పాటు ఇతర దేశాలకు విస్తరించాలని యాజమాన్యం భావిస్తోంది. వార్తా సేవలను మరికొన్ని నెలల్లోనే తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది . ఇక ఫేస్బుక్లో తమ వార్తలను పబ్లిష్ చేసే వారికి డబ్బులు కూడా చెల్లిస్తామంటూ ఫేస్బుక్ దిగ్గజం స్పష్టం చేసింది.
అమెరికాలో సక్సెస్
అమెరికాలో ప్రారంభించిన వార్తా సేవలు సక్సెస్ కావడంతో మరో ఆరునెలల్లో ఈ సేవలను భారత్తో పాటు ఇతర దేశాల్లో ప్రారంభిస్తామని ఫేస్బుక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలోని పలు పబ్లిషింగ్ కంపెనీలు తమ కంటెంట్ను ఫేస్బుక్పై పోస్టు చేస్తున్నందున వారికి డబ్బులు చెల్లిస్తున్నామని స్పష్టం చేసింది. అమరికాలో ఫేస్బుక్ న్యూస్కు మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడించింది. ప్రస్తుతం తమ ప్రాడక్ట్ పై వార్తలను పబ్లిష్ చేస్తున్న సంస్థలతో దీర్ఘకాలంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించింది. తద్వారా ఫేస్బుక్ న్యూస్ విలువను పెంచుతామని వెల్లడించింది.
ఆస్ట్రేలియాలో బ్రేక్ ఇందుకే..
ఇదిలా ఉంటే ఫేస్బుక్ వార్తా సేవలను ఆస్ట్రేలియాలో ప్రారంభించదని యాక్సియోస్ అనే సంస్థ రిపోర్టు ఇచ్చింది. దేశీయా వార్తా సంస్థ ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో గూగుల్ ఫేస్బుక్ సంస్థలు న్యూస్ సేవలను ప్రారంభిస్తే స్థానిక న్యూస్ ఔట్లెట్స్ దెబ్బతినకుండా వారికి డబ్బులు చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏప్రిల్లో ప్రకటన చేసింది. ఫేస్బుక్ రంగ ప్రవేశం చేస్తే సంప్రదాయ మీడియా సంస్థలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వాణిజ్య పరమైన అవకాశాలు సమానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్బర్గ్ తెలిపారు.
Recommended Video
ఫేక్ న్యూస్ పై కఠినంగా వ్యవహరించనున్న ఫేస్బుక్
ఇదిలా ఉంటూ ఫేస్బుక్కు నెలకు 2.7 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అంతేకాదు ఫేస్బుక్ పేజ్పై తప్పుడు పోస్టింగులు, సరైన సమాచారం లేకుండా పోస్టింగులు పెడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఫేస్బుక్ పై రూమర్లు ఇతరత్ర తప్పుడు సమాచారం సర్క్యులేట్ కావడంతోనే 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారని చాలామంది విశ్వసిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఫేక్ న్యూస్ పై ఫేస్బుక్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక ఈ విమర్శలు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో సరైన సమాచారంతో నాణ్యమైన వార్తలు ఇచ్చే హైక్వాలిటీ మీడియా సంస్థలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ చెప్పారు.