నా తల్లి పాచిపని చేసేది: మోడీ కంటతడి(ఫోటోలు)
భారత ప్రధాని నరేంద్రమోడీ కంటతడి పెట్టారు. సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్బుక్' వ్వవస్థాపకుడు మార్క్ జూకెర్స్బర్గ్తో జరిపిన ముఖాముఖిలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ మార్క్ జూకెర్స్బర్గ్తో ఆదివారం ముచ్చటించారు.
ఈ సందర్భంగా ‘‘మీకు, మాకు చాలా సారూప్యత ఉంది. మనకు కుటుంబం చాలా ముఖ్యం. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మీ జీవితంలో కూడా మీ అమ్మగారు చాలా కీలకం కదా?'' అంటూ జూకెర్స్ బర్గ్ అన్నారు. దీంతో తనను పెంచడానికి తన తల్లి పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ ఒకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
నా తల్లి పాచిపని చేసేది: మోడీ కంటతడి
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ నా జీవితంలో నా తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మా నాన్న గారు లేరు. మాది చాలా నిరుపేద కుటుంబం. నా చిన్నతనంలో నేను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడిని. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు మేం చాలా చిన్న పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఇరుగుపోరుగు ఇళ్లలో పాచిపని చేసేదన్నారు.
నా తల్లి పాచిపని చేసేది: మోడీ కంటతడి
తన పిల్లలను పెంచడానికి ఒక తల్లి ఎంత కష్టపడాలో చూడండి. కేవలం ఇది నరేంద్రమోడీ కథకాదు, భారత్ లోని ఎంతోమంది తల్లులు తమ పిల్లలను పెంచడానికి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. అందుకే అందరి తల్లులకు నా వందనాలు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు ఇఫ్పుడు 95 ఏళ్లు. చదువుకోలేదు. ఇప్పటికీ ఆమె తన పనులను తనే స్వయంగా చేసుకుంటారని మోడీ గద్గద స్వరంతో చెప్పారు.
నా తల్లి పాచిపని చేసేది: మోడీ కంటతడి
ఇక ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకెర్స్బర్గ్ డిజిటల్ ఇండియాకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ వాల్లో ఒక పోస్టు ప్రచురించారు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా తన ప్రొఫైల్ చిత్రాన్ని మూడు రంగుల భారత పతాకం రంగులతో రంగరించారు. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే క్రమంలో భారత్ చేస్తున్న కృషికి మద్దతిస్తున్నానని తెలిపారు.
నా తల్లి పాచిపని చేసేది: మోడీ కంటతడి
అంతేకాదు డిజిటల్ ఇండియాకు మద్దతు ఇవ్వాలని తన అభిమానులను కోరారు. భారత ప్రధాని మోడీ కూడా జూకెర్స్ బర్గ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రొపైల్ చిత్రాన్ని మార్చారు. జూకెర్స్ బర్గ్ తరహాలోనే మూడు రంగుల భారత పతాకాన్ని పెట్టారు.