ఫేస్బుక్ ద్వారా అనర్ధాలే కాదు..!మంచి పనులు కూడా..! 14 ఏళ్ల తర్వాత అన్న చెల్లెలును కలిపిన ఎఫ్బీ..!!
ఉత్తరప్రదేశ్/హైదరాబాద్ : సోషల్ మీడియా మాద్యమం ఫేస్ బుక్ వల్ల అనర్థాలే కాదు కొన్ని మంచిపనులు కూడా జరుగుతుంటాయి. ఫేస్ బుక్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని నెత్తినోరు బాదుకునే వాళ్లకు ఈ కధనం కనువిప్పుగా ఉంటుంది. ఫేస్ బుక్ వల్ల భార్యభర్తల మద్య గొడవలు, స్నేహితుల మద్య విభేదాలు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం వంటి అంశాలకు ఈ వార్త బ్రేక్ వేయనుంది. ఫేస్బుక్ సాయంతో పద్నాలుగేళ్ల తరువాత ఒక సోదరి తన సోదరునన్ని కలసుకుంది. అదే సంతోషంలో సోదరునికి రాఖీ కట్టనుంది.
ఆమెకు అప్పుడు మూడేళ్లు. తండ్రి, సోదరుని నుంచి విడిపోయింది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆ యువతి కాజల్ మాట్లాడుతూ 2005లో తనకు మూడేళ్లని, అప్పుడు నాన్నను, అన్నయ్య అభిషేక్ను విడిచిపెట్టి అమ్మ మరో వివాహం చేసుకుందని తెలిపింది. తాను తల్లితో పాటే గోవిందపురిలో ఉన్నానని, అయితే వారిద్దరూ తనను ఎంతో ఇబ్బంది పెట్టారని పేర్కొంది. తాను తన తండ్రిని, సోదరుడిని సరిగా చూసిన గుర్తుకూడా లేదని, అన్నయ్య ఎప్పుడూ రాఖీ కట్టలేదని తెలిపింది.
అయితే ఒకరోజు అమ్మ తన సోదరుని పేరు తెలిపిందని, దీంతో ఫేస్బుక్ సాయంతో అన్నయ్యను వెతికి, ఫోన్లో మాట్లాడానని పేర్కొంది. తరువాత అన్నయ్య తనను తీసుకు వెళ్లేందుకు వచ్చాడని తెలిపింది. కాగా ఈ విషయం పోలీసులకు చేరడంతో ఎస్హెచ్ఓ సంజీవ్ శర్మ ఎస్డీఎం కోర్టులో ఆ యువతికి సంబంధించిన ఫిర్యాదు అందజేశారు. దీంతో కోర్టు ఆ యువతిని... తనతోపాటు తీసుకువెళ్లేందుకు సోదరునికి అనుమతినిచ్చింది.
ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి భార్య 2005లో తన భర్తను విడిచిపెట్టి మరో యువకుడిని వివాహం చేసుకుంది. ఆమె తన 11 ఏళ్ల కుమారుడిని తండ్రి వద్దనే విడిచిపెట్టి, మూడేళ్ల కుమార్తెను తనతోపాటు తీసుకువెళ్లిపోయింది. ఇప్పుడు ఆ బాలికకు 17 ఏళ్లు వచ్చాయి. బీఏ చదువుతోంది. కాగా తల్లితో పాటు సవతి తండ్రి ఆమెను వేధించసాగారు. దీంతో ఆమె తన సోదరుడిని ఫేస్బుక్ సాయంతో కలుసుకుంది. ఎల్లుండి రాబోయే రాఖీ పర్వదినం వారి కుటుంబంలో అనురాగాల వెలుగులు నింపుతుందని వారు బావిస్తున్నట్టు తెలుస్తోంది.