రైతులకు సలాం..జవాన్లకు ప్రణామ్ -కరోనా, చైనాలను తిప్పికొట్టాం: రిపబ్లిక్ డే స్పీచ్లో రాష్ట్రపతి
కరోనా మహమ్మారి విలయం నుంచి కోలుకుంటూ, సరిహద్దులో ప్రత్యర్థులు విసిరే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత్ 72వ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలను ఉద్దేశించి సోమవారం సాయంత్రం ప్రసంగించారు. కరోనా సమయంలో రైతన్నలు, వారియర్ల స్ఫూర్తిని శ్లాఘిస్తూ, చైనా కుయుక్తులను తిప్పికొట్టిన భారత్ సైన్యం ధీరత్వానికి గర్విస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఇలా సాగింది...
భారత్, చైనా మధ్య సరిహద్దు వెంబడి నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో డ్రాగన్ దేశం తీరుపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చురకలు వేశారు. చైనా విస్తరణ వాదాన్ని ఎండగట్టారు. దేశ సరిహద్దుల్లో విస్తరణ ప్రయత్నాలను భారత్ చవిచూసిందని, అయితే ఈ ప్రయత్నాలను మన సాహస సైనికులు విఫలం చేశారని కొనియాడారు. గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారని గుర్తుచేశారు.
గల్వాన్ లోయ, సియాచిన్ సహా మన సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ భద్రత కోసం అహరహం శ్రమిస్తున్నాయని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. దేశ ఆహార భద్రతకు నిరంతరం కష్టపడే మన రైతన్న తరహాలోనే మన వీర సైనికులు సైతం సరిహద్దుల్లో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు. మన సైనికుల వీరత్వం, దేశభక్తి, త్యాగస్ఫూర్తికి దేశ ప్రజలంతా గర్విస్తున్నారని రాష్ట్రపతి తన ప్రసంగంలో కొనియాడారు.
ప్రకృతి ప్రకోపాలు, కోవిడ్ మహమ్మారి సహా అనేక సవాళ్లను అధిగమించి దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలను అందిస్తున్న రైతులకు ప్రతి భారతీయుడు సలాం చేస్తారని రాష్ట్రపతి అన్నారు. మన రైతాంగం సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా మెరుగైన వ్యవసాయ దిగుబడులను సాధిస్తున్నారని ప్రశంసించారు. రైతుల సంక్షేమం కోసం భారత్ కట్టుబడిఉందని స్పష్టం చేశారు. దేశానికి రైతాంగ సేవలు శ్లాఘనీయమని కొనియాడారు.
Recommended Video
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పూర్తి సన్నద్ధంగా ఉన్నారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ అవకాశం వినియోగించుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవితంలో మీ ఎదుగుదలకు మీ ఆరోగ్యం కీలకమని సూచించారు.