కాలుష్యంపై చర్యలు శూన్యం, జనం సంగతి పట్టదుగానీ ప్రధాని, మంత్రుల కోసం మాత్రం...
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయికి వెళ్లిందో మొన్నటివరకూ విన్నాం, టీవీల్లో చూశాం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఏమీ చేయకుండా...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ కూర్చున్నాయి.
మరోవైపు ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారుల కోసం, ప్రధాని నరేంద్రమోడీ కోసం, మంత్రుల కోసం 140 'ఎయిర్ ప్యూరిఫయర్ల'ను మాత్రం కేంద్రం కొనుగోలు చేసింది. అంటే...రాజధానిలోని సామాన్య ప్రజలు ఎటు పోయినా ఫరవాలేదుకానీ, ప్రధాని మోడీ, ఆయన చుట్టూ ఉండే అధికార యంత్రాంగం బాగుంటే చాలన్నమాట!
కాలుష్యం కోరల్లో దేశ రాజధాని...
దేశంలో అనేక నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. నగరంలో పాఠశాలల్ని 5 రోజులపాటు మూసేశారు. మొన్నటి శీతాకాలంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కాలుష్యం తగ్గే వరకు చిన్న పిల్లలకు ఇబ్బంది లేకుండా కొద్దికాలంపాటు వారికి ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేద్దామని ఏ ఒక్క ప్రభుత్వ శాఖా ఆలోచించలేదు.
ప్రధాని, మంత్రుల కోసం మాత్రం...
సామాన్య ప్రజానీకం సంగతేమోగానీ, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, ప్రధాని కార్యాలయం, మంత్రుల కోసం మాత్రం రూ.36 లక్షలు ఖర్చుపెట్టి ‘ఎయిర్ ప్యూరిఫయర్లు' కొనుగోలు చేశాయి. దేశ ప్రజల్ని బాధిస్తున్న అతి ముఖ్యమైన సమస్య పట్ల పాలకులు చూపిన శ్రద్ధ ఇలా ఉందంటూ ‘రాయిటర్స్' ఓ ప్రత్యేక కథనంలో పేర్కొంది.
సెలవులిచ్చారుకానీ సమస్య తీర్చలేదు...
బ్రిటీష్ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్' 2016 నివేదిక ప్రకారం, భారతదేశంలో 10 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం వాయు కాలుష్యం వల్లనే వస్తున్నాయి. ఢిల్లీ నగర పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు 45కు పైగా ఉన్నాయి. మొన్నటి శీతాకాల కాలుష్యం వల్ల ఈ పాఠశాలలన్నీ వారంపాటు మూతపడ్డాయి. కాలుష్య నియంత్రణ కోసం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ‘కేంద్రీయ విద్యాలయ సంఘటన్' అధికారి ఒకరు తెలియజేశారు.
ఎయిర్ ప్యూరిఫయర్లకు డిమాండ్...
ఢిల్లీలో కాలుష్యం పెరగటంతో ఈ ‘ఎయిర్ ప్యూరిఫయర్ల'కు డిమాండ్ బాగా పెరిగింది. 2017లో 'అమెజాన్ డాట్ కామ్' ద్వారా పెద్ద సంఖ్యలో 'ఎయిర్ ప్యూరిఫైర్లను ప్రజలు కొనుగోలు చేసినట్టు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ చర్యలేమీ చేపట్టకపోవటంతో చివరికి ప్రజలు చచ్చినట్లు ‘ఎయిర్ ప్యూరిఫయర్లు' కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది.
పెద్దలందరూ కొనుక్కున్నారు...
కేంద్ర హోం శాఖ రూ.13 లక్షలు ఖర్చుచేసి, గత మూడేళ్లలో 44 ఎయిర్ ప్యూరిఫయర్లను కొనుగోలు చేసింది. ప్రధాని, పార్లమెంట్ కార్యాలయం కోసం రూ.7లక్షలకు పైగా నిధులు వెచ్చించి 25 ఎయిర్ ప్యూరిఫయర్లు కొన్నారు. ఉన్నతస్థాయి అధికారుల విజ్ఞప్తుల మేరకు ‘నీతి ఆయోగ్' రూ.7 లక్షలు ఖర్చుపెట్టి ఈ పరికరాల్ని కొనుగోలుచేసింది.
కొనుక్కున్నారా అంటే మాట్లాడరు...
ఇలా కొనుగోలు చేసిన ఎయిర్ ప్యూరిఫైర్లు ఆరోగ్య, వ్యవసాయ, పర్యాటక, విదేశాంగ శాఖలకు వెళ్లాయి. సమాచార హక్కు ద్వారా సేకరించిన ఈ సమాచారంతో.. సంబంధిత శాఖల్ని ‘ఇలా చేశారా ?' అని అడిగితే మాత్రం ఎలాంటి సమాధానం రావటం లేదని ‘రాయిటర్స్' పేర్కొంది.