Fact Check: ఉద్యోగస్తుల పెన్షన్లలో 30శాతం కోతంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..?
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. పదవీవిరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షన్లలో 30శాతం కోత విధిస్తున్నట్లు ఓ వార్త వైరల్గా మారింది. ఆ వార్తకు చివరన ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే అది మరో న్యూస్ వెబ్సైట్కు తీసుకెళుతోంది. కరోనావైరస్ పై పోరుకు ఎంపీలు, మాజీ ఎంపీల జీతాల్లో నుంచి 30 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రపతి నుంచి కింది స్థాయి గుమాస్తా వరకు ఉంటుందంటూ ఆ వార్త వైరల్ అయ్యింది. అంతేకాదు 80 ఏళ్లకు పైగా ఉన్న పెన్షనర్లకు తమ పెన్షన్లో కోత విధించాలని ప్రభుత్వం భావిస్తోందంటూ ఆ వార్తలో ఉంది.
దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన పిదప అసలు ఆ వార్తలో నిజం లేదని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్ల జీతాల్లో 30శాతం కోత విధించనున్నట్లు వస్తున్న వార్తలను నిర్థారించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవు. కనీసం మీడియా ప్రకటన కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో ఇది అవాస్తవమని తేలింది. ఆ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తపై ఏప్రిల్ 9వ తేదీన స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 30శాతం కోత విధిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పీఐబీ నిర్థారించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ఇక వాస్తవం ఏంటంటే ఎంపీలు మాజీ ఎంపీల వేతనాల్లో పెన్షన్లలో ఒక ఏడాది పాటు 30శాతం కోత విధించడమే కాకుండా రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ కూడా ఉండవంటూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం కరోనావైరస్తో ఆర్థిక వ్యవస్థ కష్టతరంగా మారడం, లాక్డౌన్తో చాలా వరకు నష్టపోవడం జరిగిన నేపథ్యంలో ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు కేంద్రం ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఉద్యోగస్తుల వేతనాల్లో కోత విధిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వార్త అవాస్తవమని తేల్చింది.
Media reports & rumours circulating on social media claiming that the Govt may reduce employees' pension by 30% & terminate it for those above the age of 80, in the context of #COVIDー19, is FAKE.#PIBFactCheck: This claim is #Fake. Government is doing no such thing! pic.twitter.com/y4c0RnUDvW
— PIB Fact Check (@PIBFactCheck) April 9, 2020