Fact Check:విద్యార్థులకు యాప్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు..ఖండించిన సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
కొద్ది రోజుల క్రితం విద్యార్థులకు 10వ తరగతి 12వ తరగతి పరీక్షలు నిర్వహించరనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వార్తలను ఖండించాయి. తాజాగా ఆన్లైన్ పద్దతిలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు ఆదేశించినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇందుకోసం VH సాఫ్ట్వేర్ సంస్థ తయారు చేసిన ప్రత్యేక అప్లికేషన్ను కొనుగోలు చేయాలని సూచించింది. అంతేకాదు దీన్నంతటినీ సమీక్షించేందుకు డాక్టర్ సాహిల్ గెహ్లాట్ను ఓఎస్డీగా సీబీఎస్ఈ బోర్డు నియమించిందనే వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇలా ఉంది . "మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పరీక్షల నిర్వహణకు చాలా ఇబ్బందిగా మారిన నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని భావిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ-పరీక్ష అనే ఆన్లైన్ పరీక్షా విధానంను విజయవంతంగా ప్రయోగించాం. ఈ సాఫ్ట్వేర్ ద్వారా పరీక్ష రాస్తున్న సమయంలో విద్యార్థి కదలికలు మానిటర్ చేయడం జరుగుతుంది" అని ఉంది.
దీనిపై సీబీఎస్ఈ స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది. సీబీఎస్ఈ బోర్డు ఎలాంటి ఆన్లైన్ పరీక్షలకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. అదికూడా వీహెచ్ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి ప్రత్యేక అప్లికేషన్ కొనుగోలు చేయాలని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెసేజ్లను నమ్మరాదని బోర్డు చెప్పింది. తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఎస్ఈ తెలిపింది.