తాత వద్దన్నారు.. మనువడు ఓకే చెప్పారు: రాజీవ్ నిర్ణయమే అయోధ్య వివాదానికి కారణమా?
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అయోధ్య అంశానికి సంబంధం ఉందా..? అప్పుడు ప్రధానిగా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే భారత్లో అలజడులకు కారణమయ్యాయా..? అంటే ఔననే చెబుతోంది ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక. ఇంతకీ రాజీవ్ గాంధీకి రామజన్మభూమికి సంబంధం ఏముంది..?
రాజీకీయాల్లోకి అనుకోకుండా రాజీవ్ గాంధీ ఎంట్రీ
రాజీవ్ గాంధీ.. భారత దేశ మాజీ ప్రధాని. తల్లి ఇందిరా గాంధీ హత్యతో అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ ప్రవేశం చేయగానే 1984లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో రాజీవ్ గాంధీ దేశానికి ఆరవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ 414 స్థానాలు గెలవడంతో రాజీవ్ గాంధీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశంలో ఆయా వర్గాలు సృష్టిస్తున్న అలజడులకు చెక్ పెట్టాలని భావించారు. ముఖ్యంగా పంజాబ్, ఈశాన్య భారతంలో జరుగుతున్న అల్లర్లను అణిచివేయాలని చూశారు. ఇక్కడే తన అనుభవరాహిత్యం బయటపడింది.
షా బానో కేసులో రాజీవ్ చెప్పింది ఏమిటి..?
1985లో షాబానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తన భర్త మరో వివాహం చేసుకున్నాడని తనకు ప్రతినెలా భత్యం చెల్లించాలంటూ కోర్టులో షాబానో అనే ముస్లిం మహిళ పిటిషన్ దాఖలు చేసింది.భారత్లో ఉన్న ముస్లిం పర్సనల్ లాలో ఉన్న నిబంధనలను తాను వ్యతిరేకిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ తీర్పు సాంప్రదాయ ముస్లింలలో ఆగ్రహాన్ని రగలజేసింది.అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేలా చట్టాన్ని తీసుకువస్తానని రాజీవ్ గాంధీ ప్రకటించారు.
అయోధ్య ఆలయంకు తాళం వేసిన నెహ్రూ
రాజీవ్ గాంధీ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే బాబ్రీ మసీదులోపల రాముడి ఆలయం ఏర్పాటు చేశారు. రాముడి జన్మస్థలంలో మసీదు రావడాన్ని చాలామంది హిందువులు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు 1949లో మసీదులోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో హిందువుల్లో మరింత నమ్మకం విశ్వాసం కలిగాయి.ఇక రెండు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని భావించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దానికి తాళాలు వేసి అక్కడ పూజలు ప్రార్థనలు జరగరాదని చెప్పారు.
నెహ్రూ తాళం వేస్తే.. రాజీవ్ గాంధీ తాళం తీశారు
అప్పటి వరకు బాగానే ఉన్నా.. రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆలయం తలపులకు వేసిఉన్న తాళాన్ని తీయించమని చెప్పారు. దీంతో మళ్లీ స్థానిక కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయమే రామజన్మభూమి ఉద్యమంకు ఊపిరి పోసింది. రాముడి జన్మస్థలంలో ఉన్న మసీదును కూల్చి ఆలయ నిర్మాణం జరగాలని విశ్వహిందూ పరిషత్ భావించింది. విశ్వహిందూ పరిషత్కు అనుబంధంగా ఉన్న బీజేపీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. దీంతో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రకు పిలుపునిచ్చారు. ప్రతి హిందువూ అయోధ్యకు ఒక ఇటుకను తీసుకురావాలని పిలుపునిచ్చారు. అద్వానీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు కనెక్ట్ అయ్యారు.
రాజీవ్ మరణంతో పుంజుకున్న బీజేపీ
ఇక 1991లో రాజీవ్గాంధీ ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన 1991 ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. రాజీవ్ గాంధీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే భావన అప్పుడు చాలామందిలో ఉండేది. రాజీవ్ గాంధీ మరణం తర్వాత బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని క్రమంగా కోల్పోయింది. భారత్ అప్పటి ప్రకంపనల నుంచి ఇంకా కోలుకోవాల్సి ఉంది. అయితే తాజాగా అయోధ్య వివాదంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆలయం నిర్మాణం కోసం లైన్ క్లియర్ చేస్తూ ఇచ్చిన తీర్పు భారత లౌకిక వాదంపై గతంలోకంటే మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోందని క్వార్ట్జ్ అనే అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది.