వర్ష బీభత్సం: ఏరియల్ సర్వేలో సీఎం పేపర్ చదివారా?, ఆ వీడియోల్లో అసలు నిజమెంత?
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'ఓ వైపు భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. ఏరియల్ సర్వేకి వెళ్లిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఎంచక్కా పేపర్ ఎలా చదువుకుంటున్నారో చూశారా?' అంటూ కర్ణాటక సీఎంకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత అనేది అసలు విషయంలోకి వెళితేనే తెలుస్తుంది.
ఏరియల్ సర్వేకు వెళ్లిన సీఎం..
కేరళతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా కొడుగు జిల్లాపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగస్టు 19న ఏరియల్ సర్వే నిర్వహించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా తీసిన వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏరియల్ సర్వేలో.. పేపర్ చదవడమా?
ఆ వీడియోల్లో.. సీఎం కుమార స్వామితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ‘పేపర్ చదవడానికే అయితే హెలికాప్టర్ ఎక్కడమెందుకో' అంటూ కామెంట్లతో అదే రోజు ఈ వీడియో బయటకు వచ్చింది. ఇదే అదునుగా భావించిన ఇతర పార్టీ నేతలు వాటిని రీట్వీట్ కూడా చేశారు. ఏరియల్ సర్వే చేయకుండా ఇలా పేపర్ చదవడమెంటంటూ పలువురు నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
సీఎం ఆఫీస్ కార్యాలయ సిబ్బంది తీసిన వీడియోనే..
వాస్తవానికి ఈ వీడియోను కూడా సీఎం కార్యాలయ సిబ్బందిలో ఒకరు చిత్రీకరించారు. మైసూరు నుంచి ఏరియల్ సర్వేకు హెలికాప్టర్ ఎక్కిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి పేపర్ చదువుతుండగా తీసినవే ఆ దృశ్యాలని మీడియా కార్యదర్శి వివరణ ఇచ్చారు.
అసలు విషయం ఇదీ..
వరద ప్రభావిత ప్రాంతాలకు చేరకముందు తీసిన వీడియోనే అది. ఆ తర్వాత కొడుగు జిల్లాకు చేరుకున్నాక ముఖ్యమంత్రి కుమారస్వామి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ దృశ్యాలను ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. అయినప్పటికీ కొందరు పనిగట్టుకుని ఈ అసత్య ప్రచారానికి తెర తీశారని జేడీఎస్ పార్టీ నేతలు విమర్శించారు. అసలు విషయం తెలియకుండా ఇలాంటి షేర్లు చేస్తూ విమర్శలు చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.