చర్చలు వాస్తవదూరం, సానుభూతి లేదు.. కేంద్రంపై రైతు నేతల గుస్సా
వ్యవసాయ చట్టాలపై రైతులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో వారికి వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 8 పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ చదవాలని.. తమకు మద్దతు తెలుపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కోరారు. దీంతో రైతు నేతలు స్పందించారు. అందులో చర్చలు వాస్తవదూరం.. రైతులపై దయ, జాలి లేవని స్పష్టంచేశారు.
ఆ లేఖలో వారు చెప్పిన ప్రతీ అంశం అవాస్తవం అని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు అంటున్నారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం దురదృష్టకరం అన్నారు. తమ సమస్యల కోసం ఆరు నెలలుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
తమ ఆందోళనను మరింత ఉధృతం చేశామని వివరించారు. అయితే మధ్యప్రదేశ్లో ప్రధాని మోడీ మాత్రం.. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. దీనిని రైతు నేతలు ఖండించారు. తమ సమస్య కోసమే రోడ్డెక్కామని వివరించారు. వాస్తవానికి జూన్లో ఆందోళన ప్రారంభించామని.. కానీ రాజకీయ నేతల జోక్యంతో అదీ క్రమంగా వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. ఆ కారణంతోనే అకాళిదల్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని గుర్తుచేశారు.