ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ బాధ్యతలు: మెజార్టీ పైన ధీమాగా: కీలక నిర్ణయాల దిశగా..!
అనూహ్య పరిణామాల నడుమ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం ఊహించని పరిణామాల నడుమ ముఖ్యమంత్రి ఫడ్నవీస్..ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసారు. అయితే, అప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమైన శివసేన..ఎన్సీపీ..కాంగ్రెస్ కూటమి ఈ పరిణామం తో ఖంగుతిన్నది. దీని పైన సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
దీనిని అత్యవసర పిటీషన్ గా స్వీకరించిన సుప్రీంకోర్టులో వరుసగా రెండో రోజు వాదనలు సాగుతున్న సమయంలోనే..ఫడ్నవీస్ అధికారికంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మెజార్టీ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని..పూర్తి మెజార్టీ తమకు ఉందనే ధీమా బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్ణయం వెనుక..
ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం పైనే ఇప్పటికే రాజకీయంగా ప్రకంపణలు కొనసాగుతున్నాయి. ఇదే వ్యవహారం మీద అటు సుప్రీం కోర్టులో వాదనలు సాగుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ వ్యవహారం పైన ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు. అధికారికంగా విధుల పైన ఫోకస్ పెట్టారు. అసలు పూర్తి మెజార్టీ లేదంటూ మూడు పార్టీల కూటమి ఒక వైపు ఆరోపణలు చేస్తున్న సమయంలోనే..ఫడ్నవీస్ తన అధికారిక బాధ్యతల నిర్వహణ ప్రారంభించారు. ఆయన బాధ్యతల స్వీకరణకు బీజేపీ మహారాష్ల్రలోని ముఖ్య నేతలు మాత్రమే హాజరయ్యారు. తమకు మెజార్టీ గురించి ఇబ్బంది లేదని.. పూర్తి మెజార్టీ తమకు ఉందని స్పష్టం చేస్తున్నారు.
ఫడ్నవీస్ కు 30వ తేదీ వరకు గడువు..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన ఫడ్నవీస్ కు తొలుత గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకు సభలో బల నిరూపణకు సమయం ఇచ్చారు. ఆ లోగా సభలో ప్రభుత్వం కొనసాగటానికి వీలుగా అవసరమైన 144 మంది ఎమ్మెల్యే మద్దతు తమకు ఉందని శాసనసభా వేదికగా ఫడ్నవీస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, సుప్రీం కోర్టును ఆశ్రయించిన మూడు పార్టీల కూటమి మాత్రం ఈ రోజు లేదా రేపు బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. అయితే, బీజేపీ న్యాయవాది మాత్రం బల నిరూపణ అంశం గవర్నర్ పరిధిలోనదని..బలం నిరూపించకోవాల్సింది సభలో అంటూ ముఖుల్ ఱోహిత్గి వాదించారు. అయితే, ఈ రోజు సుప్రీం దీని పైన తీర్పు ఇస్తుందని భావించగా..మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
మొదలైన నెంబర్ గేమ్..
ఫడ్నవీస్..అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా సంతకాలు చేసిన లేఖను గవర్నర్ కు అందించారు. అయితే, ఇదే లేఖపైన సుప్రీంలో ప్రస్తావనకు వచ్చింది. సంతకాలు చేసింది ఎన్సీపీ ఎమ్మెల్యేలే అయినా.. అందులో బీజేపీకి మద్దతుగా అని ఎక్కడా ప్రస్తావించలేదని ఎన్సీపీ న్యాయవాది సింఘ్వీ కోర్టుకు నివేదించారు. ఇక, సుప్రీం వెంటనే బల పరీక్షకు ఆదేశిస్తుందని కూటమి ఆశించింది. కానీ, ఫడ్నవీస్ కు మాత్రం మరి కొంత సమయం దొరికింది. అయితే, ఫడ్నవీస్ బాధ్యతలు సైతం స్వీకరించటం..సాయంత్రానికి పాలనా పరంగా కీలక నిర్నయాలు సైతం ప్రకటిస్తారనే అంచానలు బిజేపి నేతల నుండి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అన్ని పార్టీలు నెంబర్ గేమ్ లో మునిగిపోయారు.