సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిపై హత్యాచారం..? సోషల్ మీడియాలో దుమారం.. అసలు కథ వేరే..
దాదాపు నెల రోజుల క్రితం హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్లోని దర్భంగాకు 1300కి.మీ దూరం తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని సైకిల్పై గమ్యం చేరిన జ్యోతి కుమారిపై సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ బాలికకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ మాజీ ఆర్మీ జవాన్ ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడని ఫేస్బుక్లో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. హత్యానంతరం మృతదేహాన్ని చెట్ల పొదల్లో విసిరేసినట్లుగా కొన్ని ఫోటోలు కూడా వెలుగుచూశాయి. అయితే ఇదంతా ఫేక్ అని తేలిపోయింది. ఆ మృతదేహం వెనుక అసలు కథ వేరే ఉంది.
ఎవరా మృతురాలు...
బీహార్లోని దర్భంగా పట్టణంలో ఉన్న ఓ మాజీ ఆర్మీ జవాన్ ఇంట్లో ఇటీవల 15 ఏళ్ల జ్యోతి కుమారి అనే బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమె హత్యాచారానికి గురైందన్న ప్రచారం జరిగినప్పటికీ... పోస్టుమార్టమ్ రిపోర్టులో విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు తేలింది. ఆ ఆర్మీ జవాన్ను,అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేసి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటనను సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిపై జరిగిన అఘాయిత్యంగా పేర్కొంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
క్షేమంగా ఇంటి వద్ద జ్యోతి కుమారి...
సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిపై ఓ మాజీ ఆర్మీ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడని... ఓ ప్రాంతంలోని చెట్ల పొదల్లో ఆమె మృతదేహం లభ్యమైందని కొంతమంది ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. దీనిపై ఓ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్లో భాగంగా సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిని సంప్రదించింది. తాను పూర్తిగా ఆరోగ్యంతో,క్షేమంగా ఉన్నానని... సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. అంతేకాదు,తన ఫోటోలను కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. దీంతో తనపై జరుగుతున్న ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.
Recommended Video
సైకిల్ ఫెడరేషన్ ఛాన్స్
లాక్ డౌన్ పీరియడ్లో ఢిల్లీలోని గురుగ్రామ్ నుంచి బీహార్లోని దర్భంగా వరకు 1300కి.మీ ఏడు రోజుల పాటు ఆమె సైకిల్ తొక్కిన సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడ్డ తండ్రిని సైకిల్ వెనక సీట్లో కూర్చోబెట్టుకుని.. అలుపెరగకుండా సైకిల్ తొక్కుతూ చివరకు ఇంటికి చేరింది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడం,తండ్రి అనారోగ్యం బారిన పడటంతో... సైకిల్పై ఆయన్ను కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. ఆమె సాహసానికి సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెచ్చి... ఆమెకు అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే భవిష్యత్తులో ఆమెను భారత సైకిల్ రైడర్గా చూడవచ్చునేమో..!