భక్తి పేర మహిళలతో దొంగబాబా రాసలీలలు
జైపూర్: అమాయక భక్తులను బురిడీ కొట్టించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మరో దొంగబాబా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే... భక్తిమార్గం చూపుతాడని దరిచేరితే రక్తిమార్గంలో నడిపి రాసలీలలు సాగించిన రజనీశ్ గ్రోవర్ అలియాస్ అశోక్కుమార్ అనే బాబాపై జైపూర్ పోలీసులు లైంగిక దాడి కేసు నమోదు చేశారు.
నమ్మిన భక్తురాళ్లకు మత్తు మందు కలిపిన బిస్కట్లు ఇచ్చి లైంగిక దాడి జరుపడమే కాకుండా ఫొటోలు తీసుకొని వికృతానందాన్ని పొందిన ఈ బాబాపై జైపూర్కు చెందిన ఓ 22 ఏళ్ల మహిళ కేసు పెట్టింది. ఢిల్లీలోని ఛత్తర్పూర్ ప్రాంతంలో ఇతడు నడిపే సత్సంగ్లకు ఆమె హాజరయ్యేది.
ఈ క్రమంలో జైపూర్లో ఒక షాపు ప్రారంభించిన సదరు మహిళ ఆశీస్సులు కోసం బాబాను ఆహ్వానించింది. జైపూర్లో ఆమె ఇంటిలో బసచేసిన బాబా ప్రసాదం పేరిట మత్తుమందు కలిపిన బిస్కట్లు ఇచ్చి ఆ మహిళపై, ఆమె తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మైకంలో ఉన్న మహిళ, ఆమె తల్లికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫొటోలు కూడా తీశాడు. మత్తు నుంచి తేరుకొన్న తర్వాత ఇదేమిటి? అని నిలదీస్తే వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. గుట్టురట్టు చేస్తే మీ ఫొటోలు బయటపెడతానని హెచ్చరించాడు.
ఆ మహిళ చివరకు బాబా స్మార్ట్ ఫోన్ను ఎలాగోలా చేజిక్కించుకుని, అందులో తమవి మాత్రమే కాకుండా వేరే ఇతర మహిళలకు సంబంధించిన అనేక నగ్న చిత్రాలు ఉండటం చూసి కంగుతింది. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.