అమెరికన్లకే రూ. 500కోట్ల టోకరా: నకిలీ కాల్సెంటర్ రాకెట్ గుట్టురట్టు
థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ నకిలీ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టైంది. ఈ నకిలీ కాల్ సెంటర్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. కాగా, థానెలోని మీరారోడ్డులోని మూడు కాల్సెంటర్ల ద్వారా భారీ స్కాం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 700మంది కాల్ సెంటర్ల ఉద్యోగులను పోలీసులు చుట్టిముట్టి విచారిస్తున్నారు.
కాల్ సెంటర్ కుంభకోణంలో 70 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 630 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే హరి ఓమ్ ఐటీపార్క్, యూనివర్సల్ ఔట్సోర్సింగ్ సర్వీసెస్, ఓస్వాల్ హౌజ్ అనే ఈ కాల్సెంటర్ల యజమానులు మాత్రం పరారీలో ఉన్నారు.
రూ. 500 కోట్లు
కాగా, ఈ కుంభకోణంలో విచారణ జరిగే కొద్దీ ఇంకా పెద్ద మొత్తం బయటపడే అవకాశం ఉందని థానె పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ వెల్లడించారు. ఈ కాల్ సెంటర్ కుంభకోణం వివరాలను అటు అమెరికా ఫెడరల్ అధికారులు కూడా తీసుకున్నారు. అమెరికాలో ఉంటూ ఈ కాల్సెంటర్లకు బాధితుల ఫోన్ నంబర్లు చేరవేసిన వ్యక్తుల వివరాలను అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు సేకరిస్తున్నాయి.
ప్రాక్సీ సర్వర్ సాయంతో వీవోఐపీ టెక్నాలజీ వాడుతూ రోజూ వందల కొద్దీ కాల్స్ చేయడమే ఇక్కడి ఉద్యోగుల పని. ఇలా రోజుకు కోటి నుంచి కోటిన్నర వరకూ సంపాదిస్తున్నారు. కాల్స్లో ఐదు శాతమే విజయవంతమైనా వారి నుంచే భారీ మొత్తాలు వసూలు చేసేవారు. ఓ వ్యక్తి నుంచి ఏకంగా 60 వేల డాలర్లు వసూలు చేయడం గమనార్హం. ఈ కాల్ సెంటర్ల నిర్వాహకులపై 3 కేసులు నమోదు చేశారు.
స్కాం ఎలా జరిగింది..
కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు.
ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఈ గ్యాంగు సభ్యుల్లో కొంతమంది అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్లే అక్కడివాళ్ల వివరాలు ఇచ్చి వీళ్లకు సాయం చేసేవారని తెలిసింది. ముందుగానే పన్ను ఎగ్గొడుతున్న విషయం తెలుసుకుని వీళ్లు ఫోన్ చేసేవారు. ఒకేసారి ఏకంగా 10 వేల డాలర్లు డిమాండ్ చేసి.. చివరకు అవతలివాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంతో అంతకు సెటిల్ చేసేవారు.
ఎలా దొరికిపోయారు
మూడు అక్రమ కాల్సెంటర్లపై థానె పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. మీరా రోడ్డులోని ఏడు అంతస్తుల డెల్టా బిల్డింగులో రోజుకు మూడు షిఫ్టుల చొప్పున 24 గంటలూ నడిచే ఈ కాల్సెంటర్ల గుట్టు అప్పుడే బయటపడింది. కాల్ సెంటర్ల యజమానులు ఎలాగోలా తప్పుకొన్నారు. అయితే హైదర్ అలీ అయూబ్ మన్సూరీ అనే ఒక డైరెక్టర్ను మాత్రం పోలీసులు అరెస్టుచేశారు.
అసలైన యజమానుల కోసం గాలింపు విస్తృతంగా సాగుతోంది. హరిఓం ఐటీపార్క్, యూనివర్సల్ ఔట్సోర్సింగ్ సర్వీస్, ఆస్వాల్ హౌస్ అనే ఈ మూడు కాల్ సెంటర్లలో ఒక్కోదాంట్లో రోజుకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు సంపాదిస్తున్నారు. ప్రాక్సీ సెర్వర్ నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) కాల్ చేయడంతో ఎక్కడినుంచి చేస్తున్నారో ఎవరికీ తెలిసేది కాదు.
తన ఇంటిమీద దాడి జరగకుండా ఉండేందుకు ఒక వ్యక్తి ఏకంగా 60వేల డాలర్లు సమర్పించుకున్నాడు. వీళ్ల దగ్గర నుంచి 852 హార్డ్ డిస్కులు, హై ఎండ్ సెర్వర్లు, డీవీఆర్లు, ల్యాప్టాప్లు, కోటి రూపాయల విలువైన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు అంతస్తులలో పైదాంట్లో శిక్షణ ఇచ్చేవారు. మిగిలిన ఒక్కో ఫ్లోర్లో దాదాపు వంద వరకు ఇంటర్నెట్ కనెక్షన్లున్నాయి. కాగా, థానే పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ స్కాంను ఛేదించారు. ప్రస్తుతం ఈ నకిలీ కాల్ సెంటర్ల స్కాం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.