కర్ణాటకలో రూ.7 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత, ఒకరి అరెస్ట్
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. అయితే నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని బెలగవిలో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం నాడు పోలీసుల తనిఖీలో సుమారు రూ. 7 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పోలీసులకు పట్టుబడింది.
కర్ణాటక రాష్ట్రంలో మే 12వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరిగా తలపడుతున్నాయి. అధికారాన్ని తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాదిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనిబిజెపి ప్లాన్ చేస్తోంది. ఈ తరుణంలో రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్రంలో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున పట్టుబడడం కలకలం రేపుతోంది. నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే నకిలీ కరెన్సీని తీసుకొచ్చారని భావిస్తున్నారు.
మంగళవారం నాడు కూడ ఓ ప్రైవేట్ బస్సులో వంద కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన చోటు చేసుకొని 24 గంటలు కూడ కాకముందే సుమారు రూ. 7 కోట్ల నకిలీ కరెన్సీ పట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కరెన్సీని పంచేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇందులో భాగంగానే కరెన్సీ తరలిస్తుండగా పట్టుబడినట్టు స్వచ్ఛంధ సంస్థలు ఆరోపిస్తున్నాయి.