తిరువణ్ణామలైలో నకి"లీలలు" : పదేళ్ల నుంచి మోటు వైద్యం, ఫేక్ డాక్టర్ల అరెస్ట్
తిరువణ్ణామలై : సృష్టికి ప్రతిసృష్టి అన్నట్టు .. సమాజంలో నకిలీల బెడద ఎక్కువే. ఉపయోగించే వస్తువు, తినే తిండి, వంటకు ఉపయోగించే వస్తువుల్లో కూడా నకిలీలు ఎక్కువే. ఇటీవల బట్టబయలవుతున్న నకిలీలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తమిళనాడులో ఓ జంట మాత్రం నకిలీ వైద్య అవతారం ఎత్తారు. నకిలీ వైద్యులుగా మంచి చేస్తున్నారంటే అదీ కాదు .. తమ ప్రవృతికి తగినట్టే వ్యవహరించి .. అడ్డంగా దొరికిపోయారు. జైల్లో చేరి ఊచలు లెక్కబెడుతున్నారు.
నకిలీ వైద్యులు ..
తమిళనాడులోని తిరువణ్ణామలై కృష్ణానగర్లో ప్రభు, కవిత దంపతులు నివసిస్తున్నారు. వీరి వృత్తి సంగతెంటో తెలియదు కానీ .. ప్రవృత్తి ప్రపంచానికి తెలిసిపోయారు. ఎక్కడ నేర్చుకున్నారో ఏమో తెలియదు కానీ .. గర్భస్రావం చేయడం ప్రారంభించారు. తిరువణ్ణామలైలోని ఈశాన్యలింగం వద్ద గల మెడికల్ షాపు అడ్డగా మార్చుకొన్నారు. ఇక్కడ ఆబార్షన్ల పరంపర కొనసాగిస్తున్నారు. గత పదేళ్ల నుంచి వీరు చేస్తున్న మోటు వైద్యం గురించి .. మీడియా, పోలీసులకు తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కాలేజీ విద్యార్థులే ఎక్కువ ..
చిన్నగా మొదలైన ఆబార్షన్ల ప్రక్రియ .. క్రమక్రమంగా పెరిగింది. ఒకరి నుంచి మరొకరికి పాకి వీరి దగ్గరకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే వీరు ఏ వైద్యుల వద్ద పనిచేశారంటే అదీ కాదు. తమకు తెలిసీ, తెలియని నాటు వైద్యం చేస్తూ ముందుకుసాగుతున్నారు. వారి వద్దకు పెళ్లికాని యువతులే ఎక్కువగా వచ్చేవారని తెలుస్తోంది. కాలేజీ విద్యార్థినులు వచ్చేవారని .. వారికి మంచి చెప్పాల్సింది పోయి .. ఎక్కువ డబ్బులు వసూల్ చేసి ఆబార్షన్ చేసినట్టు తెలుస్తోంది. కొందరు బాలికలు ఉన్నారనే చేదు నిజం కూడా బయటపడింది. తమకు అప్పుడే పిల్లలు వద్దనుకున్న మహిళలు కూడా ప్రభు దంపతులను ఆశ్రయించినట్టు విశ్వసనీయ సమాచారం.
నకి"లీలలు" తెలిసిందిలా ?
తిరువణ్ణామలైలో ప్రభు దంపతులు నకిలీ డాక్టర్లుగా పదేళ్ల నుంచి కొనసాగుతున్నారు. అయినా ప్రపంచానికి తెలియకపోవడంలో అంతర్యం ఏముందనే ప్రశ్న సామాన్యుడి మదిలో మెదులుతుంది. వీరి వద్దకు పోలీసులు వచ్చారా ? మీడియా ప్రతినిధులు నిలదీశారా ? అయినా ఎందుకు తెలియలేదంటే మాత్రం సమాధానం లేదు. ఇటీవల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణీ పరీక్ష చేయించుకుంది. అయితే మళ్లీ తిరిగిరాలేదు. కానీ పీహెచ్సీ రికార్డులో మాత్రం ఆమె ఇచ్చిన అడ్రస్ ఉంది. దీంతో ఆమె ఉండే ప్రాంతం కనుక్కొని మరీ ఇంటికెళ్లి కలిశారు. ప్రెగ్నెంట్ కదా .. మళ్లీ తిరిగి ఎందుకు రాలేదు .. ప్రశ్నించారు. తొలుత తబబడ్డ తర్వాత అబర్షాన్ చేయించుకున్నట్టు ఆ మహిళ చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రికి రాకపోవడంతో ఎక్కడ చేయించుకున్నావని అడగడంతో ... నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. తిరువణ్ణామలైలో ప్రభు దంపతులు గర్భస్రావం చేశారని మహిళ చెప్పడంతో విస్తుపోవడం పీహెచ్సీ సిబ్బంది వంతైంది.
పోలీసుల అదుపులో ..
దీంతో మెడికల్ షాపు వద్ద జరుగుతున్న దురగతాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రభు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ప్రాథమిక విచారణలో ప్రభు దంపతులు పదేళ్ల నుంచి ఆబార్షన్లు చేస్తున్నట్టు తేలింది. ఇప్పటికే దాదాపు 4 వేల మందికి గర్భస్రావం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరిపై సంబంధింత కేసులు నమోదు చేశామని .. మేజిస్ట్రేట్ ముందు హజరుపరిచి రిమాండ్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. సమాజంలో వీరి వంటి నకిలీ డాక్టర్లతో .. కొందరు మంచి వైద్యులకు కూడా చెడుపేరు వస్తోందని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. వీరిపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరికొంతమంది నకిలీ వైద్యులు ఆవిర్భాస్తారని .. దీంతో మహిళల ప్రాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.