Fact check: ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల పెంపు, నిజమెంత?
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు ప్రభుత్వాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా, 7వ వేతన సంఘంకు సంబంధించిన ఒక తప్పుడు వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు సంబంధించిన షిప్టు సమాయాన్ని(పని గంటలను) 10 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అదొక తప్పుడు వార్త అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్రం పొడిగించిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమని, ప్రభుత్వానికి అలాంటి ఆలోచన కూడా లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం నుంచి తమకు ఏమైనా తీపి కబురు అందుతుందా? అని చూస్తున్న నేపథ్యంలో డీఐ పెంపు ఆలస్యం అవుతుందని ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. జూన్ 2021 వరకు డీఏ పెంపు లేదని తెలిపింది. దీంతో వారంతా కొంత నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో నకిలీ, తప్పుడు వార్తలు ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు పనిగంటలు పెంచిందంటూ తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో పీఐబీ స్పష్టతనిచ్చింది.