Fake Alert : ఆరోగ్య సేతుపై 'నిఘా' అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో బాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను గుర్తించడంతో పాటు.. పాజిటివ్ పేషెంట్లకు దూరంగా ఉండేలా సామాన్య జనాన్ని అప్రమత్తం చేయడంలో ఈ యాప్ పనిచేస్తుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో మొబైల్ నంబర్,పేరు,వయసు,జెండర్ ఇతరత్రా వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అలాగే సెల్ఫోన్ బ్లూ టూత్,లొకేషన్ నిరంతరం ఆన్ మోడ్లో ఉంచాలి. తద్వారా కోవిడ్ 19 పేషెంట్ ఎవరైనా మీ సమీపంలో ఉన్నట్టయితే యాప్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే మీలో ఏవైనా కరోనా లక్షణాలు కనిపించినా.. ఈ యాప్ ద్వారా రిపోర్ట్ చేసి వైద్య సదుపాయం పొందవచ్చు.
అయితే ఈ యాప్పై పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ యాప్ ద్వారా నిఘా పెడుతోందని సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి. ఒక వార్తా పత్రికలో దీనికి సంబంధించిన కథనం రావడంతో ఈ మెసేజ్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా ప్రజలపై నిఘా పెట్టారన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. యూజర్ వ్యక్తిగత డేటా పట్ల గోప్యత ఉంటుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరేకొరికి ఆ సమాచారం చేరే అవకాశం లేదని చెప్పింది.
కేవలం కొత్త కోవిడ్ 19 కేసులను గుర్తించేందుకు.. వారికి సమీపంలో ఉన్నవారిని అలర్ట్ చేసేందుకే ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ దేశవ్యాప్తంగా 11 భాషల్లో అందుబాటులో ఉంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ-MeiTY ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించారు.