ఇస్రో, నాసా సైంటిస్టును.. యువతిని దారుణంగా బురిడీ కొట్టించిన నయవంచకుడు
ఇస్రో, నాసా శాస్త్రవేత్తను అని నమ్మించి ఓ యువతిని బురిడీ కొట్టించిన యువకుడు కటకటాలపాలయ్యాడు. అంతేకాకుండా పీహెచ్డీ స్టూడెంట్ను అని నమ్మించడం ఈ వ్యవహారంలో యువకుడి మోసానికి పరాకాష్టగా నిలచింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకొన్నది. ఈ నయవంచకుడి మోసానికి యువతి ఎలా బలైపోయిందనే విషయం ప్రస్తుతం జాతీయ మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇంతకు ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే..
దేశ రాజధాని ఢిల్లీలో ఘటన
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని జితేంద్ర తాను ఇస్రో సైంటిస్టును అని చెప్పుకొన్నాడు. ఫేక్ ఐడీ సృష్టించి పెళ్లిచూపులకు ముందు వారిని మోసగించాడు. డీఆర్డీవో పనిచేశానని, పీహెచ్డీ విద్యార్థిని అని, త్వరలోనే నాసాలో శాస్త్రవేత్తగా చేరబోతున్నానని నమ్మించాడు. ఇలా గుడ్డిగా నమ్మించి యువతిని మోసం చేశాడనే విషయం బయటపడింది. దాదాపు రెండేళ్లు కాపురం తర్వాత ఈ విషయం బయటపడటం గమనార్హం.
నాసా ప్రయోగంలో చేరబోతున్నా
పెళ్లి తర్వాత డీఆర్డీవోలో పనిచేస్తున్నాను. త్వరలోనే నాసాలో చేరేందుకు వెళ్తున్నాను. నాసా చేపట్టే కీలక ప్రయోగంలో భాగస్వామ్యం కాబోతున్నానని చెప్పిన మాటలపై భార్యకు అనుమానాలు రేకెత్తాయి. భర్త చెప్పే విషయాలకు, తన ప్రవర్తనకు తేడా ఉండటంతో జితేంద్ర గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అమెరికాకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి గుర్గావ్లో మకాం పెట్టారు. ఈ వ్యవహారం భార్య దృష్టికి రావడంతో అనుమానాలు పటాపంచలైపోయాయి.
దారుణంగా మోసపోయి
అయితే పెళ్లికి ముందు, ఆ తర్వాత జితేంద్ర చెప్పిందంతా అవాస్తవం. తాము దారుణంగా మోసపోయామని తెలుసుకొన్నారు. ఇక చేసేదేమీ లేకుండా తమను మోసగించిన జితేంద్రపై ద్వారక ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్రను అరెస్ట్ చేసి విచారించడంతో అసలు నిజం బయపడింది.
తప్పు ఒప్పుకొన్న నయవంచకుడు
తన భార్యను, కుటుంబ సభ్యులను తప్పుడు సమాచారంతో మోసగించింది నిజమేనని తన మోసాన్ని బయటపెట్టారు. డీఆర్డీవో, నాసా, పీహెచ్డీ స్టూడెంట్ అని చెప్పిన విషయాలు నిజం కాదని తప్పును అంగీకరించారు. దాంతో జితేంద్రపై ఉత్తర ద్వారకా పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. జితేంద్ర వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.