Fake : వైరల్ అవుతున్న ఆ న్యూస్లో నిజం లేదు...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫేక్ న్యూస్ను కట్టడి చేయడం పెద్ద సవాల్గా మారింది. నిజానిజాలతో సంబంధం లేకుండా రోజుకు కొన్ని పదుల సంఖ్యలో ఫేక్ న్యూస్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరో ఫేక్ న్యూస్ తెర పైకి వచ్చింది.
ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్లో కేంద్రం కొన్ని రంగాలకు మినహాయింపునిచ్చిన నేపథ్యంలో.. ఏదైనా కంపెనీలో ఎవరైనా ఉద్యోగికి కరోనా పాజిటివ్గా తేలినట్టయితే ఆ సంస్థ యజమానిని అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.
అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా కంపెనీని సీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను కొంతమంది తప్పుగా రిపోర్ట్ చేయడం వల్లనే ఈ ఫేక్ న్యూస్ పుట్టుకొచ్చింది.
వాస్తవమేంటంటే.. సంస్థ యజమాని కరోనా నియంత్రణ మార్గదర్శకాలను పాటించకపోయినా,నిర్లక్ష్యంగా వ్యవహరించినా విపత్త నిర్వహణ చట్టం'05 కింది జరిమానా విధించబడుతుంది. కాబట్టి పని ప్రదేశాల్లో ఆరోగ్యశాఖ సూచించిన సోషల్ డిస్టెన్స్,శానిటైజేషన్ వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్రం చెబుతోంది.