Fake news buster: ‘రైల్వే ఉద్యోగుల జీతాల్లో కోతలు’, నిజమేనా?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల జీతాల్లో స్వల్ప కోతలు విధించిన విషయం తెలిసిందే. అయితే, రైల్వే ఉద్యోగుల జీతాల్లో కూడా కోతలు విధించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
రైల్వేలోని అందరు ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు రంగం సిద్ధమైందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వార్తలు విస్తృతంగా ప్రచారం జరగడంతో రైల్వే ఉద్యోగులు ఆందోళనలకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు, మంత్రిత్వశాఖ వద్ద స్పష్టత తీసుకోగా.. రైల్వే ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోతలు విధించడం లేదని తేలింది. రైల్వే ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఇంతకుముందు ఉద్యోగుల పింఛన్లలో కోతలు విధిస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అది కూడా ఆ తర్వాత తప్పుడు ప్రచారమే అని తేలింది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి కోతలు విధించడం లేదని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.
పింఛన్లలో 20 శాతం కోత విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జీతాలు, పింఛన్లలో ఎలాంటి కోతలు విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, మే 3 వరకు కరోనా లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా అప్పటి వరకు కూడా రైలు సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.