False news:ఆ రాష్ట్రంలోకి ముస్లిం పాల వ్యాపారులను అడ్డుకుంటున్నారనే వార్తల్లో నిజమెంత..?
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
తాజాగా ఓ వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. దీని ప్రకారం పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన ముస్లిం సామాజిక వర్గపు గుజ్జర్లు హిమాచల్ ప్రదేశ్లో పాలు సప్లయ్ చేసేందుకు వెళుతుండగా వారిని ఆ రాష్ట్రంలోకి ప్రవేశం లేకుండా నిషేధం విధించారంటూ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో హోషియార్పూర్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లా మెజిస్ట్రేట్ క్లారిటీ ఇచ్చారు. పంజాబ్ నుంచి వచ్చి హిమాచల్ ప్రదేశ్కు పాలు సరఫరా చేస్తున్న గుజ్జర్లపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. ఉనా జిల్లాలో కర్ఫ్యూ విధించడం జరిగిందని ఇక సాధారణ ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతించడం జరుగుతోందని చెప్పారు.
ఇదిలా ఉంటే పాసులు ఉండి నిత్యావసర వస్తువులను రవాణా చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మరోవైపు పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు ప్రైవేట్ వాహనాల్లో వస్తున్న పాలవ్యాపారులు తప్పనిసరిగా పాస్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అధికారుల నుంచి ఈ పాసులను పొందొచ్చంటూ చెప్పారు ఉనా జిల్లా కలెక్టర్. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్న సమయంలో ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు.. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్న సందర్భంలో వారికి పాసులు జారీ చేసి సమస్యలను పరిష్కరించినట్లు గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్.
Recommended Video