Fake news: ఉప్పు కొరత ఉందన్న వార్తలో నిజమెంత..? పోలీసులు ఏం చెబుతున్నారు..?
న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.
తాజాగా సోషల్ మీడియాను ఓ వార్త చుట్టేస్తోంది. అదే ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఉప్పుకొరత ఏర్పడిందని. దీంతో అక్కడి ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై అస్సాం పోలీసులు స్పష్టత ఇచ్చారు. కొందరు అల్లరి మూకలు ఇలాంటి పనులకు పాల్పడ్డారని చెప్పారు. ఈ సమయంలో ఆందోళన సృష్టిద్దామనే కొందరు మూకలు ఇలాంటి ఒక తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వెల్లడించారు. అస్సాంలో ఉప్పు కొరత ఏర్పడబోతోందంటూ వచ్చిన వార్తలో నిజం లేదని చెప్పారు. ఇవన్నీ అవాస్తవాలని ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దని భరోసా ఇచ్చారు.
ఇక అస్సాం రాష్ట్రంలో ఉప్పుతో సహా అన్ని నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలకు ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని వెల్లడించారు. ఇలాంటి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో షికారు చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.