Fact Check: కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు కుదింపు..నిజమేనా..?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును కుదించే యోచనలో కేంద్రం ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో పాటు కొన్ని ప్రధాన మీడియాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును తగ్గిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయస్సును 50 ఏళ్లకు కుదిస్తారనే వార్త ప్రచారంలోకి రావడంతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
సమాజంలో కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేసి ఆందోళనకర వాతావరణం సృష్టిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి అదేదో ప్రభుత్వం చెప్పినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారని అలాంటి వార్తల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏదైనా అనుమానం వస్తే సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం పొందాలని సూచించారు.
కరోనావైరస్ విస్తరిస్తున్న వేళ ఇలాంటి సంక్షోభ సమయంలో తప్పుడు వార్తలు ప్రజలకు చేరవేయడం సరికాదన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు. ఇక లాక్డౌన్ సందర్భంలో తక్కువ మంది సిబ్బందితోనే రోజూవారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఇక లాక్డౌన్ నేపథ్యంలో డీఓపీటీ ఉద్యోగుల వేతనాల పెంపు కార్యక్రమాన్ని వాయిదా వేసిందని జితేందర్ సింగ్ చెప్పారు. ఇక యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షపై కూడా స్పష్టత ఇచ్చారు. ఈ పరీక్ష మే 3తర్వాత నిర్వహించడం జరుగుతుందని జితేందర్ సింగ్ చెప్పారు. అంతేకాదు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కూడా రిక్రూట్మెంట్ను నిలిపివేసిందని చెప్పిన జితేందర్ సింగ్ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇక పెన్షనర్ల పెన్షన్ నుంచి 30శాతం కోత ప్రభుత్వం విధిస్తోందంటూ వచ్చిన వార్త కూడా నిజం కాదని చెప్పారు. పెన్షన్కు సంబంధించి మార్చి 31న ప్రతి పెన్షనర్ల అకౌంట్లో తమ వేతనం జమ అయ్యిందని స్పష్టం చేశారు.ఇక అవసరమైన చోట్ల పెన్షన్ను పెన్షనర్ల ఇంటికే చేర్చాలని పోస్టల్ డిపార్ట్మెంట్లను కోరినట్లు జితేందర్ సింగ్ చెప్పారు.