ఫేక్ న్యూస్ కారణంగానే వలస కార్మికుల్లో ఆందోళనలు: హోంమంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: ఫేక్ న్యూస్ కారణంగానే అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలను వెళ్లేందుకు ఆందోళనలకు గురయ్యారని హోంమంత్రిత్వ శాఖ మంగళవారం పార్లమెంటులో వెల్లడించింది. టీఎంసీ ఎంపీ మాలా రాయ్ ప్రశ్నలకు బదులిస్తూ హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు.
లాక్డౌన్ విధించిన తర్వాత వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు ఎందుకు బయల్దేరారని సదరు ఎంపీ ప్రశ్నించారు. లాక్డౌన్ సమయంలో ఫేక్ న్యూస్ కారణంగానే వలస కార్మికులు తీవ్ర ఆందోళనలకు గురై, సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆహారం, నీరు, ఆరోగ్య సేవలు, నివాసం లాంటి విషయాలపై వలస కార్మికులు ఆందోళన చెందారని తెలిపారు.
అయితే, ఈ పరిణామాలను ముందే అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం.. లాక్డౌన్ సమయంలో.. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులతోపాటు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి తెలిపారు. సామాన్య, పేద ప్రజలకు అవసరమైన ఆహారం, నీరు, వైద్యం లాంటి సదుపాయాలను అందుబాటులోనే ఉంచామని వెల్లడించారు.
లాక్ డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారని ఎంపీ మలారాయ్ మరో ప్రశ్న వేశారు. దీనికి మంత్రి బదులిస్తూ.. మరణాల డేటా కేంద్రం వద్ద లేని చెప్పారు. కేంద్రం దీనికి సంబంధించి ఎలాంటి డేటాను ఏర్పాటు చేయలేదని తెలిపారు. అయితే, వలస కార్మికులకు, పేద ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వలస కార్మికుల తరలింపును కూడా ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు.
కాగా, వలస కార్మికుల మరణాలపై సోమవారం కేంద్రమంత్రి సంతోష్ కుామర్ గంగ్వార్ పార్లమెంటులో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ సమయంలో చోటు చేసుకున్న వలస కార్మికుల మరణాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని సోమవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఆ సమాచారం లేనందున వారికి పరిహారం అందించే అవకాశం కూడా లేదని తెలిపింది.
కరోనాను ప్రారంభదశలోనే అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్చి 25 నుంచి సుమారు మూడు నెలలపాటు కఠినంగా లాక్డౌన్ను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికులు పనులు లేక తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలువురు మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారు.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో పలువురు సభ్యులు ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వలస కార్మికులకు ఎదురైన సమస్యలను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందంటూ విమర్శించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంతోష్ కుామర్ గంగ్వార్ సమాధానం ఇచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కరోనా కట్టడికి లాక్ డౌన్ సమయంలో కలిసి కట్టుగా పోరాటం చేశారని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, కేంద్రం గణాంకాల ప్రకారం.. 1.04 కోట్ల మంది వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో వారి సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. కేంద్రం వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, రాష్ట్రాలు బస్సు సర్వీసులు నడిపాయి. అప్పటికే చాలా మంది కార్మికులు రోడ్డు మార్గం గుండా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువురు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.